ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్.. మార్కెట్ల మెగా ర్యాలీకి కారణాలివే..

గడచిన 12 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అమెరికా ఎంట్రీతో కొలిక్కి వచ్చింది. తాజాగా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికా బీ2 బాంబర్లు అణు స్థావరాలపై చేసిన దాడుల తర్వాత ప్రస్తుతం ఇరాన్ అణు ఆయుధాల తయారు చేయలేదని జేడీ వ్యాన్స్ చెప్పారు. కాల్పుల విరమణ అంగీకారంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. 

నేడు దేశీయ స్టాక్ మార్కెట్లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా లాభంతో ముందుకు సాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ఉండటంతో ఇన్వెస్టర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్కెట్లను సానుకూలంగా ముందుకు నడిపిస్తున్న కీలక అంశాల గురించి పరిశీలిస్తే..

1. ముందుగా భారత స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్ల దిశను మార్చిన ప్రధాన అంశం ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటమే. ఇజ్రాయెల్ కాల్పులు నిలిపివేస్తే తాము కూడా ఆపుతామని ఇరాన్ కూడా ప్రకటించటంతో ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. 12 గంటల్లో ఇవి అమలులోకి వస్తాయని ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో సరఫరా గొలుసులో ఇబ్బందులు ఎదురవుతాయనే భయాల నుంచి ఇన్వెస్టర్లకు రిలీఫ్ లభించింది. 

2. ప్రపంచ వ్యాప్తంగా చమురు దిగుమతులపై ఆదారపడిన అనేక దేశాలు ట్రంప్ ప్రకటనతో సంతోషంలో ఉన్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర బ్రెంట్ 5.53 డాలర్లు తగ్గి బ్యారెల్ 71.48 డాలర్లకు చేరుకోవటమే దీనికి ప్రధాన కారణం. పైగా భారత్ కూడా తన చమురు అవసరాల్లో 80 శాతాన్ని దిగుమతి చేసుకోవటం.. ప్రస్తుతం యుద్ధం అంతానికి రావటంతో భారత స్టాక్ మార్కెట్లు తమ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. 

3. ఇరాన్-ఇజ్రాయెల్ ఒప్పందంతో ఆసియా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, షాంగై ఎస్ఎస్ఈ, హాంకాంగ్ హ్యాంగ్ సెంట్ సూచీలు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి. అలాగే సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. 

4. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ గవర్నర్ మిచెల్ బౌమన్ ద్రవ్యోల్బణం తగ్గుతూ ఉంటే జూలైలో రేటు తగ్గింపుకు మద్దతిస్తామని చేసిన కామెంట్స్ మార్కెట్లలో కొత్త ఆశలు నింపుతున్నాయి. యూఎస్ రేటు తగ్గింపు అంచనాలు భారత ఈక్విటీలతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ప్రవాహాలకు మద్దతు ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గటం రిస్కీ అసెట్స్ లో పెట్టుబడిపై రాబడులను ఆకర్షనీయంగా మారుస్తుందని వారంటున్నారు.