కెనడాలో మన స్టూడెంట్ మృతి

కెనడాలో మన స్టూడెంట్ మృతి

టొరంటో: కెనడాలో దాడికి గురైన మన దేశ స్టూడెంట్ గుర్విందర్ నాథ్ ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయాడు. టొరంటోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థనాథ్​ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. గుర్విందర్ మృతిపట్ల సంతాపం తెలిపారు. 

అసలేం జరిగిందంటే.. 

కెనడాలోని బిజినెస్ స్కూల్​ స్టూడెంట్ అయిన గుర్విందర్ నాథ్(24) పార్ట్​ టైమ్​గా పిజ్జా డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మిస్సిసాగాలోని క్రెడిట్ వ్యూ రోడ్​లో డెలివరీకి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అడ్డుకుని బైక్ దొంగిలించేందుకు యత్నించారు. నాథ్​పై తీవ్రంగా దాడి చేశారు. అతడు కుప్పకూలడంతో బైక్​తీసుకుని పరారయ్యారు. 

అటుగా వెళ్తున్న స్థానికులు గుర్విందర్​నాథ్​ను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్న నాథ్ ఈ నెల 24న మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. క్రెడిట్ వ్యూ రోడ్​ పెద్దగా జనాలు ఉండే ఏరియా కాదని, బైక్ చోరీ కోసమే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.