‘బాల్ వీర్’ పాత్రలో ఆబాలగోపాలాన్ని అలరించిన టీవీ నటుడు దేవ్ జోషిని అరుదైన అవకాశం వరించింది. వచ్చే ఏడాది (2023 సంవత్సరంలో) చంద్రుడి యాత్రకు వెళ్లనున్న స్పేస్ ఎక్స్ రాకెట్లో ఆయన బెర్త్ ఖరారైంది. జపాన్ కు చెందిన బిలియనీర్ యుసాకూ మేజావా తనతో పాటు మరో 8 మందిని మూన్ టూర్ కోసం ఎంపిక చేశారు. ఈజాబితాలో మన దేశానికి చెందిన టీవీ నటుడు 26 ఏళ్ల దేవ్ జోషి పేరు కూడా ఉంది. ఈ తరుణంలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా దేవ్ జోషి స్పందించారు. ఈ గొప్ప చారిత్రక ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉందన్నారు. “జీవితం నన్నెప్పుడూ కొత్త కొత్త అవకాశాలతో ఆశ్చర్యపరిచింది. నేనెప్పుడూ కలలోనూ ఊహించని మరో గొప్ప అవకాశం నన్ను వరించింది. భారత దేశం తరపున ఈ ప్రాజెక్టులో పాల్గొనబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొంటూ జోషి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. మూడేళ్ల వయసు నుంచే సీరియళ్లలో నటించడం ప్రారంభించిన దేవ్ జోషికి 2019 సంవత్సరంలో ‘బాల్ శక్తి పురస్కార్’ వచ్చింది.
ఆ రెండు సీరియల్స్ తో పేరు ప్రఖ్యాతులు..
బాల్ వీర్ అనే ప్రధాన పాత్రలో దేవ్ జోషి నటించిన ‘బాల్ వీర్’ సీరియల్ ‘సోనీ సబ్’ చానల్లో 2012 అక్టోబరు 8 నుంచి ప్రసారమైంది. 2016 నవంబరు 4 వరకు దీనికి సంబంధించిన 1,111 ఎపిసోడ్లు ప్రసారమై సరికొత్త రికార్డును సృష్టించాయి. దీన్నిబట్టి ఆ సీరియల్ కు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి కొనసాగింపుగా సోనీ సబ్ చానల్ లోనే 2019 సెప్టెంబరు 10 నుంచి ‘బాల్ వీర్ రిటర్న్స్’ సీరియల్ ప్రసారం మొదలైంది. 2021 ఏప్రిల్ 2 వరకు దీనికి సంబంధించిన 354 ఎపిసోడ్లు ప్రసారం చేశారు.
మూన్ టూర్కు వెళ్లే మిగతా వారిలో..
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ‘డియర్ మూన్’ ప్రాజెక్టు పేరుతో మూన్ టూర్ ను 2023 సంవత్సరంలో నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ 2018 సంవత్సరంలోనే జరిగింది. మూన్ టూర్ కోసం వెళ్లే స్పేస్ ఎక్స్ రాకెట్లోని మొత్తం 9 సీట్లను జపాన్ బిలియనీర్ యుసాకూ మేజావా ఒక్కరే 2018లోనే కొనేశారు. ఈ చంద్రయాత్ర కోసం జపాన్ బిలియనీర్ యుసాకూ మేజావా, దేవ్ జోషితో కలిసి వెళ్లనున్న వారిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్ స్టీవ్ ఓకీ, యూట్యూబర్ టిమ్ డోడ్, ఆర్టిస్ట్ యెమీ ఎడి, ఫొటోగ్రాఫర్లు కరీం ఇలియా, రియానాన్ ఆడం, ఫిల్మ్ మేకర్ బ్రెండాన్ హాల్, కొరియన్ సింగర్ టాప్ ఉన్నారు. ఇక అమెరికా స్నో బోర్డర్ కైట్లిన్ ఫారింగ్టన్, జపాన్ డ్యాన్సర్ మియూలను కూడా ఇందుకోసం ఎంపిక చేశారు. అయితే క్రూ టీమ్ లోని ఎవరైనా గైర్హాజరైతే వారి స్థానంలో ఈ ఇద్దరికి అవకాశం కల్పిస్తారు.