
అమ్మాయిల హాకీ టీమ్కు ఒలింపిక్ క్వాలిఫయర్స్ బెర్త్
హిరోషిమా: డ్రాగ్ ఫ్లికర్ గుర్జిత్ కౌర్ డబుల్స్ గోల్స్తో సత్తా చాటడంతో మహిళల ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీలో ఇండియా టైటిల్ ఫైట్కు దూసుకెళ్లింది. తద్వారా టోక్యో ఒలింపిక్ క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్కు కూడా అర్హత సాధించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 4–2తో చిలీని ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. గుర్జిత్ (22, 37వ నిమిషాల్లో) డబుల్ ధమాకా మోగించగా, నవ్నీత్ కౌర్ (31వ నిమిషం), కెప్టెన్ రాణి రాంపాల్ (57వ నిమిషం) ఒక్కో గోల్తో జట్టుకు ఘన విజయం అందించారు.
చిలీ ప్లేయర్లు కరోలినా గార్సియా (18వ), మాన్యెలా ఉరాజ్ (43వ) చెరో గోల్ చేశారు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో జపాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్లో హోమ్టీమ్ జపాన్ పెనాల్టీ షూటౌట్లో 3–1తో రష్యాను ఓడించింది. నిర్ణీత టైమ్లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలువగా.. షూటౌట్లో జపాన్నే విజయం వరించింది.