
- బ్యాడ్మింటన్లో నిత్యకు కాంస్య పతకం
- షూటింగ్, ఆర్చరీలో నిరాశ
పారిస్: భారీ ఆశలతో బరిలోకి దిగిన తెలంగాణ స్టార్ అథ్లెట్ జివాంజీ దీప్తి పారిస్ గడ్డపై కంచు మోత మోగించింది. బరిలోకి దిగిన తొలిసారే పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల టీ20 ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో రేస్ను ముగించి మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకుంది. ఈ కేటగిరీలో ఇండియాకు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఇక మెగా గేమ్స్ అథ్లెటిక్స్లో ఇది ఆరో మెడల్ కాగా, ఓవరాల్గా ఇండియా తరఫున 16వ పతకం.
బలమైన పోటీదారులు ఉన్న రేసును నెమ్మదిగా మొదలుపెట్టిన 21 ఏండ్ల దీప్తి తొలి 200 మీటర్లలో నాలుగో ప్లేస్లో నిలిచింది. కానీ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎక్కువ కావడంతో క్రమంగా తన వేగాన్ని పెంచుకుంటూ రేసు చివర్లో మూడో ప్లేస్లోకి దూసుకొచ్చింది. ఓవరాల్గా ఉక్రెయిన్ రన్నర్ షూలియర్ (55.06 సెకన్లు), అసెల్ ఆండెర్ (టర్కీ, 55.23 సెకన్లు) వరుసగా గోల్డ్, సిల్వర్ను సొంతం చేసుకున్నారు.
బుల్లెట్ దిగలే..
స్టార్ షూటర్ అవని లేఖరా.. విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్హెచ్1లో ఐదో ప్లేస్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో అవని 420.6 పాయింట్లు మాత్రమే సాధించింది. ఎలిమినేషన్ స్టేజ్–2లో అవని వరుసగా 10.6, 9.3 పాయింట్లే రాబట్టడంతో వెనుకబడిపోయింది. స్వీడన్ షూటర్ అన్నా బెన్ 10.4, 9.9, 10.1 పాయింట్లతో నాలుగో ప్లేస్కు దూసుకొచ్చింది.
ఇద్దరి మధ్య 1.3 గ్యాప్ ఉండటంతో అవని పతకానికి దూరమైంది. నీలింగ్ మూడు సిరీస్ల్లో కలిపి ఇండియన్ షూటర్ 150.9 పాయింట్లు రాబట్టింది. ప్రోన్లో 150.6 పాయింట్లు, స్టాండింగ్లో 98.8 పాయింట్లు తెచ్చింది. కాగా, మోనా అగర్వాల్ 13వ ప్లేస్తో క్వాలిఫికేషన్ రౌండ్లోనే నిష్ర్కమించింది.
పూజ క్వార్టర్స్తోనే సరి
పారా ఆర్చర్ పూజ జత్యాన్.. విమెన్స్ రికర్వ్ ఓపెన్ ఆర్చరీలో క్వార్టర్ఫైనల్లోనే నిష్క్రమించింది. క్వార్టర్స్లో పూజ 4–6తో వుయ్ చున్యన్ (చైనా) చేతిలో కంగుతిన్నది. తొలి రెండు సెట్లు గెలిచి 4–0తో ఆధిక్యంలో నిలిచిన పూజ.. చివరి మూడు సెట్లలో నిరాశపర్చింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్లో పూజ 6–0తో యగ్ముర్ సెనెగుల్ (టర్కీ)పై గెలిచింది.
ఇక విమెన్స్ ఎఫ్ 34 షాట్పుట్లో భాగ్యశ్రీ జాదవ్ ఐదో ప్లేస్తో సరిపెట్టుకుంది. రెండో ప్రయత్నంలో భాగ్యశ్రీ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరింది. దీంతో పోడియం ఫినిష్ చేయలేకపోయింది. చైనాకు చెందిన లిజువాన్ జో (9.14 మీ) గోల్డ్, లకినా కర్నోబాయ్ (పోలెండ్, 8.33 మీ) సిల్వర్ సాధించారు.
పరుగుతోనే సమాధానం..
అథ్లెటిక్స్లో అద్భుత ప్రతిభ చూపిస్తున్న దీప్తి ప్రయాణం స్ఫూర్తి దాయకం. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామంలో మేధో బలహీనతతో జన్మించిన దీప్తి చిన్నప్పుడు పేదరికంతో పాటు వైకల్యంతోనూ పోరాడింది. తన వయసు అమ్మాయిల మాదిరిగా భావాలను వ్యక్తం చేయలేదు. ఈ కారణంగా తను ఎన్నో వెక్కిరింపులకు గురైంది. వాటికి తన పరుగుతోనే సమాధానం చెప్పింది. 15వ ఏట అథ్లెటిక్స్లోకి అడుగుపెట్టిన దీప్తి పట్టుదలతో రన్నింగ్పై అద్భుతమైన పట్టు పెంచుకుంది. కోచ్ రమేశ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న ఈ తెలంగాణ అథ్లెట్ పారా అథ్లెటిక్స్పై స్పష్టమైన ముద్ర వేసింది.
2019లో హాంకాంగ్లో జరిగిన చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలవడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి న దీప్తి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2020 గువాహటిలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 100మీ, 200 మీటర్లలో గోల్డ్ మెడల్స్తో మంచి పేరు తెచ్చుకుంది. 2023 ఆసియా పారా గేమ్స్లో ఆసియా గేమ్స్ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గడంతో గెలిచి ఒక్కసారిగా పారా అథ్లెటిక్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2024 వరల్డ్ చాంపియన్షిప్లో 55.07 సెకన్లతో వరల్డ్ రికార్డుతో బంగారు పతకం సాధించింది. ఇప్పుడు తన తొలి పారాలింపిక్స్లోనే పతకం తెచ్చిన దీప్తికి మంచి భవిష్యత్తు ముందుంది.
నిత్య శ్రీకి బ్రాంజ్..
బ్యాడ్మింటన్లో నిత్య శ్రీ సివాన్ ఇండియాకు ఐదో పతకంగా బ్రాంజ్ మెడల్ అందించింది. కొత్తగా ప్రవేశపెట్టిన విమెన్స్ సింగిల్స్ ఎస్హెచ్ 6 బ్రాంజ్ ప్లే ఆఫ్ మ్యాచ్లో నిత్య శ్రీ 21–14, 21–16తో రినా మర్లినా (ఇండోనేసియా)పై గెలిచింది. 23 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ సూపర్ షాట్లతో చెలరేగింది. సుదీర్ఘమైన ర్యాలీలు ఆడుతూ వరుసగా పాయింట్లు నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్లో నిత్య 13–21, 19–21తో లిన్ షుంగ్బావో (చైనా) చేతిలో ఓడింది. ఎస్హెచ్ 6 కేటగిరీలో పొట్టిగా ఉండి నిలబడి ఉన్న ప్లేస్లోనే బ్యాడ్మింటన్ ఆడతారు.