న్యూఢిల్లీ: మనదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వులు ఈ నెల నాటికి ఎనిమిది బిలియన్ డాలర్లు తగ్గి 553.11 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2020 అక్టోబరు తొమ్మిది తరువాత ఫారెక్స్ ఇంతలా తగ్గడం ఇదే మొదటిసారని ఆర్బీఐ ప్రకటించింది. ఈ ఏడాది జులై తరువాత ఫారెక్స్ రిజర్వులు బాగా తగ్గాయని పేర్కొంది. పోయిన వారం వీటి విలువ 561.05 బిలియన్ డాలర్లు. వరుసగా ఐదు వారాలుగా ఇవి తగ్గుతూనే ఉన్నాయి. గోల్డ్ అసెట్ల విలువ కూడా ఈ నెల రెండు నాటికి 39.64 బిలియన్ డాలర్ల (అంతకుముందు వారం విలువ) నుంచి 38.30 బిలియన్ డాలర్లకు పడింది.
డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గకుండా అడ్డుకోవడానికి ఆర్బీఐ భారీగా డాలర్లను అమ్మడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇన్ఫ్లేషన్ను తట్టుకోవడానికి ఇండియా సహా చాలా దేశాలు వడ్డీరేట్లను పెంచాయి. దీంతో రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే రూపాయితోపాటు ఇతర దేశాల కరెన్సీల విలువ బాగా తగ్గిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు. నిజానికి ఇతర దేశాలతో పోలిస్తే రూపాయి తగ్గుదల తక్కువేనని పేర్కొన్నారు.
