
జాగ్రెబ్ (క్రొయేషియా): ఇండియా గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్.. మూడో అంచె గ్రాండ్ చెస్ టూర్లో శుభారంభం చేశాడు. ర్యాపిడ్ సెగ్మెంట్ లో భాగంగా గురువారం జరిగిన మూడు రౌండ్లలో విషీ రెండు విజయాలు, ఓ డ్రాతో సరిపెట్టుకున్నాడు. దీంతో ఐదు పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచాడు.
తొలి రెండు గేమ్ల్లో ఆనంద్ వరుసగా గ్రాండ్ మాస్టర్స్ రిచర్డ్ రాపోర్ట్ (రొమేనియా), కాన్స్టాంటిన్ లుప్లెస్కూ (రొమేనియా)పై గెలిచాడు. అలీరెజా ఫిరౌజాతో జరిగిన మూడో రౌండ్ గేమ్ను డ్రా చేసుకున్నాడు. ఇండియా యంగ్ మాస్టర్ డి. గుకేశ్ తొలి రౌండ్లో వరల్డ్ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడాడు. తర్వాతి రెండు రౌండ్లలో ఇయాన్ నెపోమాంచెటి, ఫిరౌజాతో జరిగిన గేమ్లను డ్రాగా ముగించాడు.