
న్యూఢిల్లీ: ఇండియా వాణిజ్య లోటు (దిగుమతులు మైనస్ ఎగుమతులు) ఈ ఏడాది మే నెలలో 21.88 బిలియన్ డాలర్లకు తగ్గింది. వివిధ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్టీఏల)ను కుదుర్చుకుంటుండడంతో వాణిజ్య లోటు కొంత దిగొచ్చింది. ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్లో వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. గత ఏడాది మే నెలలో ఈ నెంబర్ 22.09 బిలియన్ డాలర్లుగా ఉంది. మే 2025లో గూడ్స్ ఎగుమతులు ఏడాది లెక్కన 2.17 శాతం తగ్గి 38.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
గత ఏడాది మేలో 39.59 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే టైమ్లో దిగుమతులు 61.68 బిలియన్ డాలర్ల నుంచి 1.7శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. ఇక సర్వీసెస్ ట్రేడ్ విషయానికొస్తే, మేలో అంచనా వేసినట్టే 14.65 బిలియన్ డాలర్ల మిగులును ఇండియా సాధించింది. సర్వీసెస్ ఎగుమతులు 32.39 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 17.14 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్–-మే కాలంలో, మొత్తం ఎగుమతులు 77.19 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 125.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. “గ్లోబల్ ట్రేడ్ పాలసీలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇండియా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది”అని ప్రభుత్వం ప్రకటించింది.