క్రూడాయిల్ దిగుమతులు రూ.9.04 లక్షల కోట్లకు!

క్రూడాయిల్ దిగుమతులు రూ.9.04 లక్షల కోట్లకు!
  • 2021–22 లో రెండింతలు పెరిగిన  ఇంపోర్ట్స్‌‌‌‌ విలువ
  • క్రూడాయిల్ రేట్లు పెరగడమే కారణం..

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ క్రూడాయిల్ దిగుమతులు రెండింతలు పెరిగాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో గ్లోబల్‌‌‌‌గా ఆయిల్ క్రైసిస్ నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో దేశ ఆయిల్ దిగుమతుల విలువ 2021–22 లో రెండింతలు పెరిగి 119 బిలియన్ డాలర్ల (రూ. 9,04,400 కోట్ల) కు చేరుకుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్‌‌‌‌ సెల్‌‌‌‌ (పీపీఏసీ) విడుదల చేసిన డేటా ప్రకారం, దేశ ఆయిల్ దిగుమతుల విలువ 2020–21 లో 62.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచలోనే క్రూడాయిల్‌‌‌‌ను ఎక్కువగా వాడుతున్న మూడో అతిపెద్ద దేశంగా ఇండియా నిలిచింది. క్రూడాయిల్ ధరలు ఈ ఏడాది మార్చిలో 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఒక్క నెలలోనే క్రూడాయిల్ కోసం ఏకంగా 13.7 బిలియన్ డాలర్లను ఇండియా ఖర్చు చేసింది. కిందటేడాది మార్చి నెలలో 8.4 బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకున్నాం. బ్రెంట్ క్రూడాయిల్ (బ్యారెల్‌‌‌‌) రేటు ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి పెరగడం స్టార్ట్ చేశాయి. మార్చి మొదటి వారంలో 140 డాలర్ల వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని టచ్ చేసింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ రేటు 106 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.  

గ్యాస్ దిగుమతులూ పెరిగాయ్‌..
పీపీఏసీ డేటా ప్రకారం, 2021–22 లో 212.2 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌‌‌‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో  ఈ నెంబర్ 196.5 మిలియన్‌‌‌‌ టన్నులుగా రికార్డయ్యింది. కాగా, ఈ సారి కరోనా ముందు స్థాయిల కంటే తక్కువ ఆయిల్‌‌‌‌నే దిగుమతి చేసుకున్నాం. కానీ, ఆయిల్ రేటు పెరగడంతో ఎక్కువ అమౌంట్‌‌‌‌ను దిగుమతుల కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.  2019–20 లో 227 మిలియన్‌‌‌‌ టన్నుల ఆయిల్‌‌‌‌ను దిగుమతి చేసుకోగా, ఇందుకోసం 101.4 బిలియన్ డాలర్లనే ఇండియా ఖర్చు చేసింది.   

క్రూడాయిల్‌‌‌‌ను రిఫైనింగ్ చేసి కొన్ని పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లను ఇతర దేశాలకు కూడా ఇండియా ఎగుమతి చేస్తోంది. కానీ, ఎల్‌‌‌‌పీజీ గ్యాస్‌‌‌‌ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడుతోంది. 2021–22 లో మొత్తం 202.7 మిలియన్‌‌‌‌ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లను దేశంలో వినియోగించారు. పీపీఏసీ డేటా ప్రకారం, 2021–22 లో 24.2 బిలియన్ డాలర్ల విలువైన 40.2 మిలియన్ టన్నుల పెట్రోల్ ప్రొడక్ట్‌‌‌‌లను ఇండియా దిగుమతి చేసుకుంది. అదేవిధంగా 42.3 బిలియన్ డాలర్ల విలువైన 61.8 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లను ఎగుమతి చేసింది. దీనికి అదనంగా 32 బిలియన్ క్యూబిక్ మీటర్ల  ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌జీ గ్యాస్ కోసం 11.9 బిలియన్ డాలర్లను 2021–22 లో ఖర్చు చేసింది. ఎగుమతులను కూడా కలుపుకుంటే నికరంగా ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతుల బిల్లు  113 బిలియన్ డాలర్ల (రూ. 8.58 లక్షల కోట్ల) కు పెరిగింది. 2020–21 లో ఈ బిల్లు 92.7 బిలియన్ డాలర్లుగా ఉంది.