న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరగడంతో ఇండియా రిటైల్ ఇన్ఫ్లేషన్ (కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్– సీపీఐ) మే నెలలో 3.93 శాతానికి చేరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఏప్రిల్లోని 3.48 శాతంతో పోలిస్తే పెరిగినప్పటికీ, ఇది రాయిటర్స్ అంచనా వేసిన 4 శాతం కంటే తక్కువగా ఉంది.
అంతేకాకుండా, రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పెట్టుకున్న 4శాతం మిడ్టర్మ్ టార్గెట్ కంటే దిగువన నమోదైంది. రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్లోని 4.20శాతం నుంచి మే నెలలో 4.78 శాతానికి పెరిగింది. ఇందులో టమాటో ధరలు ఏకంగా 48.43శాతం పెరగ్గా, బంగాళాదుంపల ధరలు 23.71శాతం తగ్గాయి. విద్యుత్, గ్యాస్, ఇంధన ధరల వృద్ధి 0.81శాతానికి చేరింది.
గత వారం జరిగిన పాలసీ సమావేశంలో ఆర్బీఐ తన రెపో రేటును 5.25శాతం వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ, పెరుగుతున్న ముడి చమురు ధరలు, రుతుపవనాల అనిశ్చితి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది.
