
న్యూఢిల్లీ: భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులు ఈ నెల పది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తగ్గింపులు, తక్కువ ధరల కారణంగా రష్యా ముడి చమురు ఆంక్షల ప్రభావం నుంచి బయటపడటంతో మనదేశం అక్కడి నుంచి భారీ ఎత్తున చమురును కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, భారతదేశం తమకు లభించే తగ్గింపులను సద్వినియోగం చేసుకుంటూ దిగుమతులను పెంచుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, రష్యా నుంచి లభించే తక్కువ ధరల చమురు భారతదేశానికి ఆర్థికంగా లాభదాయకంగా మారింది.
కమోడిటీ మార్కెట్ ఎనలిటిక్స్ సంస్థ కేప్లర్ ప్రకారం, ఈ నెలలో భారతదేశం రష్యా చమురు దిగుమతులు ఏప్రిల్ నెల కంటే 1.6 శాతం పెరిగి రోజుకు 1.97 మిలియన్ బ్యారెల్స్ (బీపీడీ)కు చేరుకున్నాయి. మే నెలలో భారతదేశం మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా ముడి చమురు వాటా దాదాపు 39 శాతంగా ఉంది. ఈ నెలలో భారతదేశం మొత్తం చమురు దిగుమతులు రోజుకు 5.11 మిలియన్ బ్యారెల్స్గా ఉండగా, ఇది క్రితం నెలతో పోలిస్తే 5.2 శాతం ఎక్కువ. రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే చమురులో ప్రధానమైన రష్యా ఫ్లాగ్షిప్ క్రూడ్ గ్రేడ్ 'ఉరల్స్' సగటు ధర మే నెలలో 50 డాలర్లు ఉంది. ఇది రష్యా చమురుపై పశ్చిమ దేశాలు విధించిన బ్యారెల్కు 60 డాలర్ల ధర పరిమితి కంటే బ్యారెల్కు 10 డాలర్లు తక్కువ.