స్పెయిన్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్లో ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సింధు 21–16, 21–12తో వెన్ యు జాంగ్ (కెనడా)పై నెగ్గింది. 30 నిమిషాల మ్యాచ్లో సింధు బలమైన ర్యాలీలు, క్రాస్ కోర్టు విన్నర్స్తో ఆకట్టుకుంది. తొలి గేమ్లో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా రెండో గేమ్లో తెలుగమ్మాయి ఏకపక్షంగా ముందుకెళ్లింది. 3–0తో తొలి గేమ్ను మొదలుపెట్టిన సింధుకు జాంగ్ వరుస పాయింట్లతో షాకిచ్చింది. దీంతో 4–4, 10–10తో స్కోరు సమమైంది.
ఈ దశలో సింధు నాలుగు పాయింట్లు నెగ్గినా, జాంగ్ మళ్లీ 14–14తో స్కోరు ఈక్వల్ చేసింది. ఇక్కడి నుంచి సింధు నాలుగు పాయింట్లు గెలిచి లీడ్ను 18–14కు పెంచుకుంది. ఆ తర్వాత మరో మూడు పాయింట్లతో గేమ్ను చేజిక్కించుకుంది. ఇక రెండో గేమ్లో 5–5తో స్కోరు సమమైన తర్వాత సింధు వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ఐదు, రెండు, మూడు పాయింట్లు సాధిస్తూ స్పష్టమైన ఆధిక్యంతో ఈజీగా గేమ్, మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్లో అష్మిత చాలియా 13–21, 11–21తో రచనోక్ ఇంతనోన్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్ రెడ్డి–సిక్కి రెడ్డి 16–21, 22–20, 21–14తో చెన్ జి రే–యాంగ్ చింగ్ టున్ (చైనీస్తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టారు.