- డొమెస్టిక్ మార్కెట్లో సేల్ అయిన 38.9 లక్షల యూనిట్లు
- ఎస్యూవీ వంటి యుటిలిటీ బండ్లకు ఫుల్ డిమాండ్
- ఎంట్రీ కార్లు, బైక్లకు తగ్గిన గిరాకీ
- వెల్లడించిన సియామ్
న్యూఢిల్లీ: కార్లు, బస్సులు వంటి ప్యాసెంజర్ వెహికల్ (పీవీ) సేల్స్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ లెవెల్కు చేరుకున్నాయి. డిమాండ్ పెరగడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–23 లో పీవీ హోల్సేల్స్ 26.73 శాతం పెరిగాయి. ‘మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి డీలర్లకు డిస్పాచ్ అయిన ప్యాసెంజర్ వెహికల్స్ కిందటి ఆర్థిక సంవత్సరంలో 38,90,114 గా ఉన్నాయి. 2021–22 లో ఈ నెంబర్ 30,69,523 యూనిట్లుగా రికార్డయ్యింది’ అని సియామ్ ప్రకటించింది. పీవీల హోల్సేల్స్లో ఇదే హయ్యస్ట్ కావడం విశేషం. గతంలో హయ్యస్ట్గా 2018–19 లో 33,77,436 యూనిట్లు డిస్పాచ్ అయ్యాయి. పీవీ సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం ఎస్యూవీ వంటి యుటిలిటీ వెహికల్స్కు డిమాండ్ పెరగడమేనని సియామ్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. 2021–22లో 14,89,219 యుటిలిటీ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల నుంచి డీలర్స్కు డిస్పాచ్ కాగా, 2022–23లో ఏకంగా 20, 03,718 యూనిట్లు డిస్పాచ్ అయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 34.55 శాతం గ్రోత్కు సమానం. ప్రస్తుతం పీవీ సెగ్మెంట్లో యుటిలిటీ వెహికల్స్ వాటా 51.5 శాతంగా ఉంది. 2022–23 లో కరోనా సంక్షోభం నుంచి, సప్లయ్ చెయిన్ సమస్యల నుంచి ఆటో ఇండస్ట్రీ కోలుకుందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘సప్లయ్ చెయిన్ను సమర్ధంగా వాడుకోవడం, కమొడిటీలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లు అందుబాటులో ఉండడం వలన వెహికల్స్ ధరలు కొద్దిగానే పెరిగాయి’ అని చెప్పారు.
కమర్షియల్, టూవీలర్ సేల్స్ కూడా పైకే..
ప్యాసెంజర్ వెహికల్స్తో పాటు కమర్షియల్ వెహికల్స్, టూ వీలర్ సేల్స్ కూడా భారీగా జరిగాయి. 2022–23 లో 9,62,468 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ కంపెనీల ప్లాంట్ల నుంచి డీలర్స్కు డిస్పాచ్ (హోల్సేల్) అయ్యాయి. ఇది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో సెకెండ్ హయ్యస్ట్. 2021–22 లో కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 7,16,566 యూనిట్లుగా ఉన్నాయి. టూవీలర్, త్రీవీలర్ , కమర్షియల్ వెహికల్స్ సేల్స్ పెరిగినప్పటికీ ఇంకా కరోనా ముందు స్థాయికి చేరుకోలేదని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అన్నారు. 2022–23లో 1,58,62,087 యూనిట్ల టూవీలర్ హోల్సేల్స్ జరిగాయని, 2021–22 లో ఇది 1,35,70,008 యూనిట్లుగా రికార్డయ్యిందని పేర్కొన్నారు. ఎంట్రీలెవెల్ కార్లు, టూవీలర్ల అమ్మకాలు మాత్రం 57 శాతం మేర పడ్డాయని అన్నారు.
దేశ ఎగుమతులు 770 బిలియన్ డాలర్లకు..
గూడ్స్ ఎగుమతులు 2022–23 లో 447 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కామర్స్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఇదే టైమ్లో గూడ్స్ దిగుమతులు 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ ఏడాది ప్రాతిపదికన 613 బిలియన్ డాలర్ల నుంచి 16.5 శాతం పెరగగా, ఎగుమతుల విలువ 442 బిలియన్ డాలర్ల నుంచి 6 శాతం పెరిగింది. గూడ్స్, సర్వీస్లు రెండూ కలుపుకుంటే దేశ ఎగుమతులు 2022–23 లో 14 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి 670 బిలియన్ డాలర్ల నుంచి 770 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కామర్స్ మినిస్టర్ పియూష్ గోయెల్ అన్నారు. దేశ ఎగుమతులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. 2020–21 లో ఎగుమతులు విలువ 500 బిలియన్ డాలర్లు ఉండగా, 2021–22 లో 676 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. కాగా, దేశ సర్వీస్ సెక్టార్ ఎగుమతులు 2022–23 లో ఏడాది ప్రాతిపదికన 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021–22 లో సర్వీస్ ఎగుమతులు 254 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియా వాటా పెరుగుతోందని గోయెల్ అన్నారు. కాగా, ఫారిన్ ట్రేడ్ పాలసీలకు సంబంధించి 5 ఇయర్ ప్లాన్కు బదులు ఎటువంటి గడువు లేని కొత్త సిస్టమ్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. గ్లోబల్ పరిస్థితులకు తగ్గట్టు ఈ పాలసీని మారుస్తారు. ‘ఒక ట్రిలియన్ డాలర్ల గూడ్స్ ఎగుమతుల టార్గెట్ను చేరుకుంటాం. 2030 నాటికి సర్వీస్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లు దాటినప్పుడు గూడ్స్ ఎగుమతులు వెనకబడవు. దేశ ఎగుమతులు 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయి’ అని గోయెల్ వివరించారు.
