
- పాక్తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు: సీఎం రేవంత్
- దమ్ముంటే పీవోకేను గుంజుకోండి.. బలూచిస్తాన్ను విడదీయండి
- గొప్పలకు తిరంగా ర్యాలీలు తీస్తరా? సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించరా? అని ఫైర్
- రాహుల్ ప్రధాని అయితేనే దేశ గౌరవం నిలబడుతుందని వ్యాఖ్య
- మేడ్చల్లో పీసీసీ ఆధ్వర్యంలో జైహింద్ యాత్ర
హైదరాబాద్, వెలుగు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారని, పాకిస్తాన్తో యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రధాని మోదీకి వీరతిలకం దిద్ది యుద్ధానికి పంపితే ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిండు. యుద్ధాన్ని మధ్యలో ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మీకెక్కడిది (మోదీ)? ఆమెను ఆదర్శంగా తీసుకొని.. దమ్ముంటే పీవోకేను గుంజుకోండి.
పాక్ నుంచి బలూచిస్తాన్ను విడదీసి చూపించండి” అని మోదీకి సవాల్ విసిరారు. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ ఆధ్వర్యంలో గురువారం మేడ్చల్ నియోజకవర్గంలో జైహింద్ యాత్ర నిర్వహించారు. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి నిజాంపేటలోని కొలన్ గోపాల్ రెడ్డి కన్వెన్షన్ వరకు యాత్ర కొనసాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. అమెరికా ముందు ప్రధాని మోదీ తలవంచారని, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. ‘‘పహల్గాం దాడి తర్వాత రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ అండగా నిలిచింది.
హైదరాబాద్లో వేలాది మందితో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాం. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని మోదీకి మద్దతిచ్చాం. అఖిలపక్ష సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కేంద్రానికి పూర్తి సహకారం అందించారు. పాక్పై యుద్ధం చెయ్యిమని, కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకొమ్మని మోదీకి వీరతిలకం దిద్దాం. కానీ, యుద్ధం మొదలైన నాలుగు రోజుల తర్వాత ట్రంప్ బెదిరింపులకు మోదీ తలొగ్గారు. యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం మొదలెట్టే ముందు అఖిలపక్షాన్ని పిలిచిన మోదీ.. ఆపేటప్పుడు మాత్రం ఎందుకు సంప్రదించలేదు? అని ప్రశ్నించారు.
మోదీకి ధైర్యం లేదు..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి గుండె ధైర్యం మోదీకి లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘1967లో చైనా దురాక్రమణను తిప్పికొట్టి, ఆ దేశాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టారు ఇందిరమ్మ. 1971లో అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా.. ‘నా దేశాన్ని రక్షించే గుండె ధైర్యం నాకుంది’ అని గట్టిగా చెప్పి, పాకిస్తాన్ను రెండు ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ను సృష్టించారు. ఆమె లాంటి గుండె ధైర్యం మోదీకి ఎక్కడుంది?. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని పాకిస్తాన్ను ఓడించండి.
దమ్ముంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకోండి. పాక్ నుంచి బలూచిస్థాన్ను విడదీసి చూపించండి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, 140 కోట్ల భారతీయులు మీకు (మోదీ) అండగా నిలుస్తారు” అని పేర్కొన్నారు. కానీ ఆ గుండె ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. ‘‘చైనా 4వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించినా, కర్నల్ సంతోష్ బాబు లాంటి వీరులను మన ఆర్మీ కోల్పోయినా.. ప్రధాని మోదీ నోరు మెదపలేదు. పాక్ ఉగ్రవాదులు 26 మంది అమాయకులను బలి తీసుకున్నా, యుద్ధంలో మరో 36 మందిని చంపినా.. బీజేపీ నాయకులు నోరు మూసుకున్నారు. వాళ్లకు రక్తం మరగడం లేదా?” అని మండిపడ్డారు.
జైహింద్ యాత్ర ఎన్నికల కోసం, ఓట్ల కోసం కాదని.. సైనికుల ఆత్మగౌరవం కోసమని తెలిపారు. ‘‘పుల్వామాలో, కాశ్మీర్లో అమరులైన సైనికుల కోసం, అమాయక పౌరుల కోసం మనమంతా ఏకమై నిలబడాలి. యుద్ధంలో చనిపోయిన సైనికుల గురించి బీజేపీ ఒక్కసారైనా ఆలోచించిందా? గొప్పల కోసం తిరంగా ర్యాలీలు తీస్తారు.. కానీ సైనికుల ఆత్మగౌరవం గురించి ఆలోచించరా?” అని బీజేపీ నేతలపై మండిపడ్డారు.
దేశానికి రాహుల్ నాయకత్వం అవసరం..
రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కిలోమీటర్లు, 150 రోజులు మండుటెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ నిజమైన నాయకుడు. సొంతిల్లు లేని నాయకుడు ఈ దేశంలో రాహుల్ ఒక్కడే. ఆయన ప్రధానమంత్రి అయితే.. ఇందిరమ్మ ఆదర్శంతో పాక్, చైనాలను ఓడించి దేశ గౌరవాన్ని నిలబెడ్తరు. మోదీ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటివాడు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మన పోరాటం ఆగదు” అని పేర్కొన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ‘‘మహాత్మాగాంధీ ఈ దేశం కోసం నేలకొరిగారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. నెహ్రూ పదేండ్ల జైలు శిక్ష అనుభవించి, వేల కోట్ల ఆస్తులను దేశానికి అంకితం చేశారు. 1967లో చైనాను, 1971లో పాక్ను ఓడించిన కాంగ్రెస్ను విమర్శించే హక్కు బీజేపీకి లేదు.
పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీకి అండగా నిలిచిన మాపై ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. ఇదెక్కడి నీతి? రాహుల్ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాని కావాలి. ఆయన హయాంలోనే పీవోకేను స్వాధీనం చేసుకోవచ్చు. చైనా, పాక్ను ఓడించి దేశ గౌరవాన్ని నిలబెట్టవచ్చు. మోదీ వల్ల దేశ గౌరవం నిలబడదు.. ఇందిరమ్మ మనుమడైన రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశం సురక్షితంగా ఉంటుంది” అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్కుమర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు: మీనాక్షి
పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని కేంద్రాన్ని కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. యుద్ధానికి మన సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ, విదేశీ ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిన అవసరమేంటి? అని నిలదీశారు. దేశం కోసం అగ్ర నేతలను త్యాగం చేసిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
‘‘ఇందిరాగాంధీ 1971 యుద్ధంలో అమెరికాను ఎదిరించి, పాక్ నుంచి బంగ్లాదేశ్ను విడదీశారు. ఆమె ఎవరి ఒత్తిడి ముందు తలవంచని గొప్ప నాయకురాలు” అని అన్నారు. ట్రంప్మాటలకు తలొగ్గి తోక ముడిచిన బీజేపీ నాయకులు.. రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు.