నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీస్ CEO గోపీశెట్టి మిస్సింగ్

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీస్ CEO గోపీశెట్టి మిస్సింగ్

న్యూఢిల్లీ: నేపాల్‎లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జలప్రళయం వల్ల ఇప్పటికే 600 మందికి పైగా మృత్యువాత పడగా.. వేలాది మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో నేపాల్ వరదలకు సంబంధించి తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీస్ CEO గోపీశెట్టి నేపాల్ వరదల్లో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ అధికారికంగా ధృవీకరించింది. 

వ్యక్తిగత పని మీద గోపిశెట్టి నేపాల్‎కు వెళ్లారని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే, నేపాల్‎లో వరదలు సంభవించిన రోజు నుంచి ఆయన సంప్రదించలేకపోతున్నామని పేర్కొంది. ఆయన్ను కాంటాక్ట్ అయ్యేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నామని చెప్పింది. ఈ క్లిష్ట సమయంలో గోపీశెట్టి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించింది. 

కాగా, బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కంపెనీ సీఈవో అయిన గోపీశెట్టి వ్యూహాలు, సాంకేతికత, కార్యకలాపాలు వంటి అంశాల్లో ప్రభుత్వ సంస్థలకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. గతంలో ఆయన ఇన్ఫోసిస్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అలాగే, బిజినెస్ అప్లికేషన్స్, డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీస్ విభాగానికి నాయకత్వం వహించారు. 

కాగా, ఆగస్ట్ 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు 600 మందికి పైగా చనిపోయారని నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని తెలిపింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. 

సహయక చర్యల్లో తొలుత విదేశాల సహయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం తర్వాత మనసు మార్చుకుంది. రెస్క్యూ ఆపరేషన్, పునరావాస చర్యల్లో సహయం చేయాలని ప్రపంచదేశాలను కోరింది. నేపాల్ విజ్ఞప్తి మేరకు ఇండియా, చైనా సహా పలు దేశాలు నేపాల్ లో రెస్క్యూ ఆపరేషన్ చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి.