ఏ క్షణమైనా మరో జల ప్రళయం రావొచ్చు: నేపాల్‎కు చైనా డెడ్లీ వార్నింగ్

ఏ క్షణమైనా మరో జల ప్రళయం రావొచ్చు: నేపాల్‎కు చైనా డెడ్లీ వార్నింగ్

మొన్నటికి మొన్న వచ్చిన జల ప్రళయానికి నేపాల్ ఇప్పటికీ కోలుకోలేదు.. గల్లంతు అయిన 2 వేల మంది సంగతి తేలలేదు.. సహాయ చర్యలు జరుగుతున్న సమయంలోనే.. నేపాల్ దేశానికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది చైనా. ఏ క్షణమైనా మరో జల ప్రళయం ఖాయం అని.. భారీ ముప్పు పొంచి ఉందని.. హిమాలయాల్లోకి సరస్సులు ఉప్పొంగి ప్రవహరిస్తున్నాయి.. ప్రవాహం ఉధృతంగా ఉందని.. సరస్సుల కట్టలు ఏ క్షణంలోనే అయినా తెగే ప్రమాదం ఉందని.. జాగ్రత్తగా ఉండాలంటూ నేపాల్ దేశాన్ని హెచ్చరించింది చైనా ప్రభుత్వం.

2026, ఆగస్ట్ 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విలయతాండవం చేసిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో భారీ గ్లేసియర్ (మంచుకొండ) విరిగిపడటంతో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‎ను ముంచెత్తాయి. భారీ వరద ఉధృతికి ఊర్లకు ఊర్లే నామారూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. వరదల వల్ల ఇప్పటికే 600 మందికి పైగా చనిపోగా.. వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

ప్రకృతి ప్రకోపానికి నేపాల్ శవాల దిబ్బగా మారగా.. యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే నేపాల్‎కు మరో ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర ఆందోళనకు కలిగిస్తోంది. సరిహద్దులోని లెండే నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడిన కృతిమ సరస్సు ఆనకట్ట ఏ క్షణంలోనైనా తెగిపోవచ్చని.. తద్వారా మరో జల ప్రళయం నేపాల్‎ను ముంచెత్తొచ్చని చైనా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. 

ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా లెండే నదీ ప్రవాహానికి శిథిలాలు అడ్డుపడటంతో ఈ బ్యారియర్ లేక్ ఏర్పడిందని చైనా తెలిపింది. ప్రస్తుతం ఈ సరస్సులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. రాబోయే మూడు రోజుల్లో కురిసే వర్షాల వల్ల మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ తాత్కాలిక సరస్సు నిండు కుండలా ఉందని.. ఏ క్షణంలోనైనా లేక్ ఆనకట్ట కూలిపోవచ్చని హెచ్చరించింది.

సరస్సులోని నీరు నలుపు రంగులోకి మారడమే ప్రమాదానికి సంకేతమని అంచనా వేసింది. ఆనకట్ట తెగితే సుమారు 500 క్యూబిక్ మీటర్ల గరిష్ట వేగంతో వరద ప్రవాహం దూసుకురావచ్చని తెలిపింది. ఎగువన ఉన్న టిబెట్ ప్రాంతంతో పాటు నేపాల్‌లోని భోటే కోశి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించింది. చైనా హెచ్చరికలతో అప్రమత్తమైన నేపాల్.. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. 

కాగా, ఆగస్ట్ 26న సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటి వరకు 600 మందికి పైగా చనిపోయారని నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వేల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారని తెలిపింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. సహయక చర్యల్లో తొలుత విదేశాల సహయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం తర్వాత మనసు మార్చుకుంది. రెస్క్యూ ఆపరేషన్, పునరావాస చర్యల్లో సహయం చేయాలని ప్రపంచదేశాలను కోరింది. నేపాల్ విజ్ఞప్తి మేరకు ఇండియా, చైనా సహా పలు దేశాలు నేపాల్ లో రెస్క్యూ ఆపరేషన్ చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి.