బడ్జెట్లో లక్షా 70 వేల కోట్లు కేటాయింపు
కొత్తగా 15,500 కిలోమీటర్ల హైవేలు
100 కొత్త ఎయిర్పోర్టులు
రాష్ట్రపతి, ప్రధాని కోసం రెండు కొత్త విమానాలు
ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా ఖర్చు పెట్టనున్నట్టు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఏకంగా కోటీ మూడు లక్షల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. అందులో భాగంగా రవాణా రంగానికి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్లో భారీగా నిధులిస్తున్నట్టు తెలిపారు. రోడ్లు, జల మార్గాలు, ఎయిర్పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం లక్షా 70 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. త్వరలోనే నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రకటిస్తామన్నారు.
అన్ని రంగాల్లో ఖర్చు..
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ‘నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (ఎన్ఐపీ)’కార్యక్రమాన్ని చేపట్టామని, దాని కింద 6,500కుపైగా ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. రోడ్లు, రైల్వే మార్గాలు, ఎయిర్పోర్టులు, విద్యా సంస్థలు, సాంప్రదాయేతర విద్యుత్, ఇండ్లు, మంచినీళ్లు అందించే పథకాలు.. వంటివన్నీ ఆ ప్రాజెక్టుల్లో ఉంటాయన్నారు. పవర్ సెక్టార్ కోసం రూ.22 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
దేశంలో హైవేల నిర్మాణ వేగాన్ని మరింతగా పెంచుతామని ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. కొత్తగా 15,500 కిలోమీటర్ల పొడవునా హైవేల నిర్మాణం చేపడతామని తెలిపారు. అందులో 2,500 కిలోమీటర్ల సాధారణ హైవేలు, 9 వేల కిలోమీటర్ల ఎకనమిక్ కారిడార్లు, తీర ప్రాంతాల్లో రెండు వేల కిలోమీటర్ల హైవేలు, మరో రెండు వేల కిలోమీటర్ల పొడవునా వ్యూహాత్మక హైవేలు నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర రోడ్ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు గత బడ్జెట్లో రూ. 83,016 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.91,823 కోట్లు కేటాయించారు. ఇక ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్హైవేను 2023 నాటికల్లా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. బెంగళూరులో 150 కిలోమీటర్ల సబర్బన్ ప్రాజెక్టు, చెన్నై–బెంగళూరు ఎక్స్ప్రెస్వే నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు. నదుల వెంట ఎకనమిక్ యాక్టివిటీని పెంచేందుకు ‘అర్థ్గంగా’ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు.
మరిన్ని హైవేలపై ‘టోల్’
నేరుగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన హైవేలపై టోల్ వసూళ్ల హక్కును ప్రైవేటుకు అమ్మేసి నిధులు సమీకరిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. నాలుగేళ్లలోగా వివిధ ప్రాంతాల్లోని సుమారు ఆరు వేల కిలోమీటర్ల హైవేలను టెండర్ల ద్వారా అప్పగించేందుకు ‘నేషనల్ హైవేస్ అథారిటీ’ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ‘టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)’విధానంలో ఇవ్వనున్నట్టు చెప్పారు. హైవేలపై అమల్లోకి తెచ్చిన ఫాస్టాగ్ విధానం ద్వారా మరిన్ని నిధులు అందుతాయని చెప్పారు.
సివిల్ ఏవియేషన్కు రూ. 3,797 కోట్లు
ఉడాన్ స్కీమ్ కింద 2025 నాటికల్లా దేశవ్యాప్తంగా మరో 100 ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకువస్తామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. ఇప్పుడున్న 600 సివిల్ విమానాల సంఖ్యను 1,200కు పెంచుతామని తెలిపారు. బడ్జెట్లో సివిల్ ఏవియేషన్కు రూ. 3,797 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చిన రూ.3,700 కోట్ల కంటే ఇది రెండున్నర శాతం ఎక్కువ. ఇక రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించేందుకు రెండు బోయింగ్ 777 విమానాలను కొనుగోలు చేయనున్నారు. వీటికోసం రూ.810 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వారు ‘ఎయిరిండియా వన్’గా పిలిచే బోయింగ్ 747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉడాన్ స్కీమ్కు గత బడ్జెట్ కంటే మూడు శాతం ఎక్కువగా రూ.465 కోట్లు ఇచ్చారు. నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను కాపాడేందుకు ఉద్దేశించిన ‘టర్న్ ఎరౌండ్ప్లాన్ ఫర్ ఎయిరిండియా’కు కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించారు. అయితే ఎయిరిండియాను పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ‘ఎయిరిండియా అస్సెట్ హోల్డింగ్ లిమిటెడ్’కు రూ.2,205 కోట్లు ఇచ్చారు.
పోర్టులను కార్పొరేటీకరణ చేస్తం
దేశంలోని పోర్టులు మరింత బాగా పనిచేసేలా ఫ్రేమ్వర్క్ రూపొందిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. కనీసం ఒక పెద్ద పోర్టును స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్చేస్తామని, కార్పొరేట్ స్థాయికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోర్టుల్లో యంత్రాల వినియోగం మరింత పెంచడం, వీలైనన్ని పనులు డిజిటలైజ్ చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుతామన్నారు.