
ఉగ్రవాదులు నయా ప్లాన్ వేశారు. ఈ సారి ఆలయాలకు వచ్చే భక్తులను భక్తితో చంపాలనుకున్నారు. ప్రసాదంలో విషం కలిపి 400లకు పైగా భక్తులను చంపాలనుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు పక్కా స్కెచ్ వేసి, ఎవ్వరికీ హాని జరగకుండా చూశారు. ఈ ఏడాది జనవరిలో ముంబై సమీపంలోని ముంబ్రాలో అరెస్టయిన ఉగ్రవాదుల బృందం ఈ మేరకు ప్లాన్ చేసిందని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గురువారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఐఎస్ తో పాటు ఇస్లాం ప్రబోధకుడు జకీర్ నాయక్ ల ప్రేరణతో వారు ఈ ఘాతుకానికి తెగబడినట్టు చార్జిషీట్ లో తెలిపారు. నిందితుల సోషల్ మీడియా ప్రొఫైల్ లో జకీర్ నాయక్ కు సంబంధించిన పలు వీడియోలు ఉండటం గమనార్హం. 400 మంది హిందూ భక్తులను చంపే ఉద్దేశంతో ప్రసాదంలో విషం కలిపేందుకు వారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ముంబ్రేశ్వర్ ఆలయాన్ని వారు సెలక్ట్ చేసుకున్నారు. థానే జిల్లా ముంబ్రా బైపాస్ వద్ద వారు బ్లాస్ట్ ట్రయల్స్ను చేపట్టారని ఏటీఎస్ అధికారులు తెలిపారు.
పేలడు పదార్ధాలు, విషపూరిత పదార్ధాల తయారీలో శిక్షణ కూడా తీసుకున్నట్టు తేలింది. ఐఎస్ తో సంబంధాలు కలిగిన ఉమ్మాతే మహ్మదీయ గ్రూపుకు చెందిన 10 మంది సభ్యులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేసి భారీ ఉగ్ర కుట్రలను నిలువరించింది.