పద్మారావునగర్, వెలుగు : స్వయం పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని, అదే తమ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీలో మంత్రి ఆధ్వర్యంలో కొత్తగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన పూజల్లో మంత్రితో పాటు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ప్రతిష్టించిన బొడ్రాయికి పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతోనే బొడ్రాయిని ప్రతిష్టించడం ఆచారంగా వస్తుందన్నారు.
హమాలీ బస్తీ వాసులు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే వారి కోరిక మేరకు నూతనంగా బొడ్రాయిని ప్రతిష్టించినట్లు తెలిపారు. గురువారం బస్తీవాసులు నూతన బొడ్రాయి వద్ద బోనాలు సమర్పిస్తారని నిర్వాహకులు చెప్పారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ సెగ్మెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, కార్పొరేటర్లు హేమలత, సునీత, పద్మారావునగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, బస్తీ అధ్యక్షుడు సుభాష్, యాదగిరి, అంజయ్య, సత్యనారాయణ, హరి చారి, శ్యామ్ పాల్గొన్నారు.