- క్యూ3లో రూ.4,591 కోట్ల నుంచి రూ.4,076 కోట్లకు తగ్గుదల
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో రూ.4,076 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకుముందుఏడాదిలోని క్యూ3లో వచ్చిన రూ.4,591 కోట్లతో పోలిస్తే ఇది 11.2 శాతం తక్కువ. హెచ్సీఎల్ టెక్కు కార్యకలాపాల నుంచి రూ.33,872 కోట్ల రెవెన్యూ రాగా, ఏడాది లెక్కన ఇది 13.3 శాతం వృద్ధి చెందింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) తో పోలిస్తే కంపెనీ నెట్ ప్రాఫిట్ 3.7 శాతం తగ్గింది. రెవెన్యూ మాత్రం 6 శాతం పెరిగింది. ‘‘రెవెన్యూ పెరగడంతో కంపెనీ వార్షిక ఆదాయం 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్ల)ను దాటింది.
మా కొత్త ఆర్డర్లు 3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. హెచ్సీఎల్ సాఫ్ట్వేర్ రెవెన్యూ క్వార్టర్ ప్రాతిపదికన క్యూ3లో 28.1 శాతం పెరగగా, ఏడాది లెక్కన 3.1 శాతం ఎగిసింది. డేటా ఇంటెలిజెన్స్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ పెరగడమే ఈ వృద్ధికి కారణం. మా క్లయింట్ల ఏఐ డిమాండ్ను తీర్చడానికి రెడీగా ఉన్నాం”అని హెచ్సీఎల్ టెక్ సీఈఓ ఎండీ సీ విజయకుమార్ వివరించారు. ఈ ఐటీ కంపెనీ క్యూ3లో 2,852 మంది ఫ్రెషర్లను తీసుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379 కి చేరింది. హెచ్సీఎల్ టెక్ షేర్లు సోమవారం 0.35 శాతం పెరిగి రూ.1,668.10 దగ్గర సెటిలయ్యాయి. మార్కెట్ ముగిసిన తర్వాత రిజల్ట్స్ వెలువడ్డాయి.
