- జిల్లాల్లో టీఆర్ఎస్ , కాంగ్రెస్ లీడర్లపై ఇంటెలిజెన్స్ నిఘా
- సెకండ్ క్యాడర్ తో రెండురోజులుగా ఆరా
- త్వరలో ఎలక్షన్స్ జరగనున్న చోట్ల స్పెషల్ ఫోకస్
జగిత్యాల, వెలుగు : దుబ్బాక బై ఎలక్షన్స్లో గెలిచిన బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి వలసల భయం పట్టుకున్నది. టీఆర్ఎస్, కాంగ్రెస్నుంచి పెద్దసంఖ్యలో లీడర్లు బీజేపీలోకి జంప్ అయ్యే చాన్స్ ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు జిల్లాల్లో ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. స్టేట్వైడ్ ఏయే లీడర్లు కాషాయ పార్టీలోకి వెళ్లే చాన్స్ ఉందో వివరాలు సేకరించి రిపోర్ట్ పంపుతున్నట్లు పోలీస్వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రతి లీడర్ రిపోర్ట్ కావాలట!
రాష్ట్ర వ్యాప్తంగా శనివారమే రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ వర్గాలు టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన లీడర్ల గురించి ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గ్రామ సర్పంచ్ మొదలుకొని మంత్రుల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడున్న పార్టీపై ఏ తరహా అసంతృప్తి ఉంది? పార్టీ మారడానికి ఇతరత్రా ఏయేఅంశాలు కారణమవుతున్నాయో తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఆయా లీడర్లకు బీజేపీ నేతలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వాళ్ల అనుచర గణం ఏస్థాయిలో ఉంది? ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలిగే చాన్స్ఉందో ప్రత్యేకంగా కనుక్కొంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సెకండ్ కేడర్ లీడర్లు, వివిధ సంఘాల నాయకుల నుంచి డాటా సేకరిస్తున్నారు.
సొంత పార్టీ లీడర్లపైనే ఎక్కువ ఫోకస్
పై నుంచి వచ్చిన ఆదేశాలమేరకు ఇంటెలిజెన్స్వర్గాలు ప్రధానంగా టీఆర్ఎస్ లీడర్లపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా వివిధ టికెట్లు ఆశించి భంగపడినవారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన చోట వాళ్లతో అంటీముట్టనట్లు ఉంటున్న టీఆర్ఎస్ లీడర్లు బీజేపీలోకి వెళ్లే చాన్స్ ఉందని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో ఒక వర్గం నేతలకు తెలియకుండా మరో వర్గం నేతలను ఆరా తీస్తున్నారు. ప్రధానంగా సెకండ్క్యాడర్ చెప్పే విషయాలను ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకొని నివేదికల్లో పొందుపరుస్తున్నారు.
సాగర్, వరంగల్, ఖమ్మంపై నజర్
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భంగపడ్డ రూలింగ్ పార్టీ ఆ మూడుచోట్ల నుంచి స్పెషల్ రిపోర్టులు తెప్పించుకుంటోంది. ఇంటెలిజెన్స్తో పాటు థర్డ్పార్టీ తో ఎంక్వైరీ చేయిస్తోంది. టీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఇతర పార్టీల బలాబలాలు, రెండు బల్దియాల పరిధిలో సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత గురించి ఆరా తీస్తోంది.
ఇకపై నిరంతర నిఘా..
అధికారపార్టీలో మండలస్థాయి లీడర్మొదలుకొని మంత్రి వరకు ఇకపై నిరంతర నిఘా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అధికారపార్టీ నేతలే ఈ విషయమై చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా టీఆర్ఎస్ పరిస్థితి, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ప్రగతి భవన్ నుంచే ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. ఈక్రమంలో ఫోన్లో ఎవరితో మాట్లాడాలన్నా భయమేస్తోందని, తమ అనుచరులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామని, కొంతకాలం ఈ పరిస్థితి తప్పేలా లేదని టీఆర్ఎస్ లీడర్లు చెప్పుకుంటున్నారు.