రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అయితే నిమిషం ఆలస్యం నిబంధనతో కొన్ని చోట్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో… ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు.. ఒక విద్యార్థిని లోపలికి అనుమతివ్వలేదు పోలీసులు. విద్యార్థిని ఎంత రిక్వెస్ట్ చేసినా లోపలికి పంపలేదు.
పెద్దపల్లి : జిల్లాలోని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో మరో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ లేకుండా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు అక్కడినుంచి వెనుతిరగాల్సి వచ్చింది.
యాదాద్రి భువనగిరి : రామన్న పేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కాలేజీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సెంటర్ దగ్గరకు ఆలస్యంగా రావటంతో పరీక్ష హాల్ లోకి అనుమతించలేదు. వారిలో ఐదుగురిది రామన్నపేట గవర్నమెంట్ కాలేజ్, ఒకరిది నలంద కాలేజ్ గా గుర్తించారు.
నిజామాబాద్ : జిల్లాలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష మిస్ అయ్యారు. వారిలో నిజామాబాద్ కు చెందిన గణేష్ అనే విద్యార్థి సెంటర్ పేరు సేమ్ ఉండటంతో కన్ఫ్యూజన్ కు గురై మరో సెంటర్ కు వచ్చాడు. దీంతో అధికారులు అతడ్ని బయటకు పంపించేశారు. అదే విధంగా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అనిత 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించలేదు.
దీంతో కష్టపడి చదివినా పోలీసులు కనికరించలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ టైమ్ కు 15 నిమిషాలు ముందే రావాలని తెలిపారు పోలీసులు.