ఒప్పందం తర్వాతే ఏపీకి బస్సులు.!

ఒప్పందం తర్వాతే ఏపీకి బస్సులు.!

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్​తో ఒప్పందం చేసుకునే వరకు ఇంటర్​స్టేట్​ బస్సులు నడపొద్దని సీఎం కేసీఆర్​ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఆయన ప్రగతి భవన్​లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఏపీ బస్సులు మన దగ్గర మస్తు తిరుగుతున్నాయి. మనవి మాత్రం తిరుగుతలేవు. దీంతో నష్టం వస్తోంది. మనం ఎన్ని తిప్పితే వాళ్లూ అన్నే తిప్పాలి. అందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలి. ఇదే మంచి సమయం. ఇలాంటి టైం మళ్లీ దొరకదు. ఒప్పందం చేసుకునే దాకా ఇంటర్​స్టేట్​ బస్సులు నడపొద్దు’’ అని చెప్పినట్టు సమాచారం. సమీక్షలో ప్రస్తుతం ఆర్టీసీకి వస్తున్న ఆదాయం, నష్టాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. పెళ్లిళ్లు, ప్రయాణాలు తక్కువగా ఉండటంతో కలెక్షన్​ అంతగా రావట్లేదని అధికారులు చెప్పారు. అయితే, లాభ, నష్టాలతో సంబంధం లేకుండా జిల్లాల్లో బస్సులు నడపాలని ఆయన అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. గ్రేటర్​లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రేటర్​లో బస్సులు నడపొద్దని చెప్పినట్టు సమాచారం. బస్సులు తిప్పితే కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందం ఇలా..

ఆర్టీసీకి సంబంధించి సరిహద్దు రాష్ట్రాలు ఇంటర్​స్టేట్​ ట్రాన్స్​పోర్ట్​ఫై ఒప్పందం చేసుకుంటాయి. ఓ రాష్ట్రానికి చెందిన బస్సు.. సరిహద్దు దాటాక పొరుగు రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో నోట్​ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం పక్క రాష్ట్రానికి చెందిన బస్సులు మన రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయో.. ఆ రాష్ట్రంలో మన బస్సులూ అన్ని కిలోమీటర్లు తిరగాలి. ఉదాహరణకు తెలంగాణ బస్సు హైదరాబాద్​ నుంచి విజయవాడకు వెళ్లిందనుకుందాం. మొత్తం 250 కిలోమీటర్ల దూరం. అందులో మన రాష్ట్రానికి సంబంధించి కోదాడ సరిహద్దు. అక్కడి నుంచి విజయవాడకు 50 కిలోమీటర్లుంటుంది. అంటే ఏపీలో తెలంగాణ బస్సు 50 కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. అదే ఏపీ బస్సు తెలంగాణలో 200 కిలోమీటర్లు తిరిగినట్టు లెక్కిస్తారు. ఆ లెక్క కోసం సరిహద్దు ప్రాంతాల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 3 లక్షల కిలోమీటర్లు తిరిగితే, తెలంగాణ బస్సులు మాత్రం ఏపీలో లక్ష కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఈ ఒప్పందం చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అసలు ఆర్టీసీనే ఇంకా విభజించలేదంటున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం చేసుకుంటే రోజూ రూ.2 కోట్ల దాకా కలెక్షన్స్​ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అనుమానంతో భార్యను.అడ్డొచ్చాడని మామను నరికి చంపాడు