
ఐపీఎల్13లో ఇంటర్–టీమ్ లోన్స్
సీజన్ మధ్యలో ఇంటర్నేషనల్ ప్లేయర్ల ట్రాన్స్ఫర్
మార్చి చివరి వారం నుంచి మెగా లీగ్!
మధ్యలోమారిపోతారు!
ఐపీఎల్ పదమూడో సీజన్ సరికొత్తగా ముస్తాబవనుంది. లీగ్ మధ్యలో తొలిసారి ఇంటర్నేషనల్ (క్యాప్డ్) ప్లేయర్ల ట్రాన్స్ఫర్కు అనుమతించబోతున్నారు. ఫుల్బాల్ మాదిరిగా ఇంటర్-టీమ్ లోన్ రూల్ను అమలు చేయనున్నారు. గతేడాది అన్క్యాప్డ్ ప్లేయర్ల ట్రాన్స్ఫర్ను ప్రవేశపెట్టగా.. ఈసారి క్యాప్డ్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు అటు.. ఇటు మార్చుకునే చాన్స్ ఇవ్వబోతున్నారట. ఇదే జరిగితే లీగ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక, ఈ సీజన్ కూడా మార్చి లాస్ట్ వీక్లో మొదలుకానుండగా.. మ్యాచ్ రోజులు తగ్గించే అవకాశం కనిపిస్తోంది.
ముంబై: పుష్కరకాలంగా క్రికెట్ ఫ్యాన్స్ను విశేషంగా అలరిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో ఎడిషన్ పట్టాలెక్కబోతోంది. మెగా లీగ్లో ప్రధాన అంకమైన ఆటగాళ్ల వేలం సక్సెస్ఫుల్గా ముగిసింది. పెద్దోళ్లు, చిన్నోళ్లు అన్న తేడా లేకుండా సత్తా ఉన్న ప్లేయర్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. కొంత మంది స్టార్లు ఒక్కసారిగా మిలియనీర్స్ కాగా.. మరికొందరు అనామకులు ఓవర్నైట్లో కోటీశ్వరులయ్యారు. తమ అవసరాలకు తగ్గట్టు అన్ని ఫ్రాంచైజీలు బలమైన జట్లను తయారు చేసుకున్నాయి. దాంతో, 13వ ఎడిషన్కు కౌంట్డౌన్ మొదలైంది. గత సీజన్లతో పోల్చితే ఈ సారి లీగ్ను స్పెషల్గా మార్చేందుకు నిర్వాహకులు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా ఫుట్బాల్ తరహాలో ఇంటర్-టీమ్ లోన్స్ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అంటే లీగ్ సగం పూర్తయిన తర్వాత ఒక ఫ్రాంచైజీ తమ టీమ్లోని ఇంటర్నేషనల్ (క్యాప్డ్ ప్లేయర్) ప్లేయర్ను మరో టీమ్కు ట్రాన్స్ఫర్ చేయడం లేదా ఆ జట్టు నుంచి ఓ ప్లేయర్ను తమ ఫ్రాంచైజీలోకి తీసుకొనే వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన చేస్తున్నారు. దీన్ని ఎనిమిది ఫ్రాంచైజీలు వినియోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారనుంది.
గతేడాదే ప్రవేశపెట్టినా..
వాస్తవానికి ప్లేయర్ ట్రాన్స్ఫర్ నిబంధనను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గతేడాదే ప్రవేశపెట్టినా ఎవరూ వినియోగించుకోలేదు. అప్పుడు కేవలం అన్క్యాప్డ్ (ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని) ప్లేయర్లను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇచ్చింది. లీగ్ మధ్యలోకి వచ్చేసరికి సదరు ప్లేయర్లు కనీసం రెండు మ్యాచ్లు ఆడి ఉండాలన్న షరతు పెట్టింది. ట్రాన్స్ఫర్ కోసం రెండు జట్లతో పాటు సదరు ప్లేయర్ కూడా అంగీకరించాలని, ఈ ప్రక్రియకు కోసం పన్నెండు రోజుల (ఏప్రిల్ 30 నుంచి మే 11వరకు) గడువు కూడా ఇచ్చింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్, కోచ్ మహేల జయవర్దనే దీన్ని సమర్థించారు కూడా. కానీ, ఈ సమయంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా ట్రాన్స్ఫర్ చాన్స్ను వాడుకోలేదు. అప్పటికే తమ జట్లలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు ఉండడం.. అన్క్యాప్డ్ ప్లేయర్లను మార్చుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదని ఫ్రాంచైజీలు భావించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ సారి అందరికీ చాన్స్
గత సీజన్లో ప్లేయర్ ట్రాన్స్ఫర్ వినియోగంలోకి రాకపోవడంతో ఈ సారి నిబంధనలు మార్చాలని ఐపీఎల్ ఆర్గనైజర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ సారి క్యాప్డ్ (ఇండియా, ఇంటర్నేషనల్) ప్లేయర్లకు ట్రాన్స్ఫర్ అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే, సగం లీగ్ పూర్తయ్యే టైమ్ (28 మ్యాచ్లు)కు ఆటగాళ్లు తమ ఒరిజినల్ జట్టు తరఫున రెండు, అంతకంటే తక్కువ మ్యాచ్లు మాత్రమే ఆడి ఉండాలన్న షరతు ఉండనుంది. ఈ ప్రక్రియ ఫ్రాంచైజీల మధ్యనే జరగనుంది. డబ్బు (ప్లేయర్ల రేటులో హెచ్చుతగ్గులుంటే) ఆక్షన్కు కేటాయించిన మొత్తం నుంచి కాకుండా బయటి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ టాన్స్ఫర్ వల్ల ప్లేయర్కు ఎలాంటి బెనిఫిట్ ఉండబోదు. కానీ, ఈ లావాదేవీల గురించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు కచ్చితంగా తెలియజేయాలి. అదే సమయంలో అన్క్యాప్డ్ ప్లేయర్ల ట్రాన్స్ఫర్ చాన్స్ ఇస్తారని సమాచారం. వీరికి గతేడాది మాదిరిగా కనీసం రెండు మ్యాచ్లు ఆడాలన్న షరతును తీసేసేచాన్సుంది. ఎన్ని మ్యాచ్లు ఆడారన్న దానితో సంబంధం లేకుండా అన్క్యాప్డ్ ప్లేయర్లంతా ట్రాన్స్ఫర్కు అర్హులు కానున్నారు. మరి, ఫ్రాంచైజీలు ఈ సారైనా ట్రాన్స్ఫర్ రూల్ను ఉపయోగించుకుంటాయే లేవో చూడాలి.
మ్యాచ్ రోజులు తగ్గిస్తారా?
గత సీజన్ మాదిరిగా ఈ సారి కూడా మార్చి చివరి వారంలో మెగా లీగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్చి 20 నుంచి మే 24 వరకు 13వ సీజన్ నిర్వహణకు సరైన టైమ్ అని బీసీసీఐ భావిస్తోంది. లీగ్ ప్రారంభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కోల్కతాలో ఆక్షన్ సందర్భంగా ఫ్రాంచైజీలకు ఐపీఎల్ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఫారిన్ ప్లేయర్ల అందుబాటును దృష్టిలో ఉంచుకొని తేదీని డిసైడ్ చేయనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఫారిన్ ప్లేయర్లంతా ఇండియాకు రానున్నారని అంచనా. కానీ, అది వీక్డే. సాధారణంగా ఐపీఎల్ వీకెండ్స్లోనే మొదలవుతుంది. ఈ విషయంపైనే నిర్వాహకులు సమాలోచనలు చేస్తున్నారు. కాగా, ఈ సారి మ్యాచ్ జరిగే రోజులు వీలైనన్ని తగ్గించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఫ్రాంచైజీల అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.