హైదరాబాద్, వెలుగు: రైస్బ్రాన్ నూనె ప్రాధాన్యం గురించి అవగాహన కలిగించడం, ఉత్పత్తిని పెంచడం, కొత్త టెక్నాలజీ వాడకంపై చర్చించేందుకు ఈనెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐఏఆర్బీఓ) ప్రకటించింది. ‘ఆసమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఫర్ సస్టెయినబల్ ఎకోసిస్టమ్’ (ఎరైజ్) థీమ్తో దీనిని జరుపుతామని తెలిపింది. ఈ సదస్సులో 400 మందికి పైగా డెలిగేట్లతో పాటుగా రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇండియా, చైనా, థాయ్ల్యాండ్, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం దేశాల నుంచి ప్రత్యేక అతిథులు పాల్గొంటారు. రైస్ బ్రాన్ ఆయిల్తోపాటు వాల్యూ యాడెడ్ ప్రొడక్టులపైనా సమాలోచనలు జరుగుతాయి. ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడంతో పాటుగా తాజా టెక్నాలజీల గురించి వివరిస్తారు.
ఎస్ఈఏ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మెహతా మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో అత్యధికంగా రైస్ బ్రాన్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తున్నది ఇండియానే! మనకు 1.9 మిలియన్ టన్నుల నూనె ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ 1.05 మిలియన్ టన్నులు మాత్రమే తయారు చేస్తున్నాం. దీనిని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగం పెరిగితే, వంటనూనెల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దానితో పాటుగా రైతులు తమ దిగుబడులపై అధిక ఆదాయమూ పొందవచ్చు. ఈ నూనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనదేశంలో 150 ప్లాంట్లు రైస్బ్రాన్ నూనెను తయారు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 35 ప్లాంటు ఉన్నాయి’’ అని అన్నారు.