
- కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్స్ ఇస్తున్న ఎయిర్లైన్ కంపెనీలు
- ఇరాన్– ఇజ్రాయెల్ యుద్దం, ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతోనే
- ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్న ప్యాసింజర్లు
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఎయిర్లైన్ కంపెనీలు నష్టపోతున్నాయి. దీనికి తోడు ఎయిర్ఇండియా విమనం కూలిపోవడంతో ప్యాసింజర్లు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం పెరిగింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ తగ్గాయి. ఎయిర్ ఇండియా తన టికెట్ రేట్లకు భారీ కోత పెట్టింది. ప్రధాన ట్రావెల్ పోర్టల్స్ నుంచి సేకరించిన డేటా ప్రకారం, రాబోయే వీకెండ్స్ (జూన్ 28–29, జులై 5–6)లో అంతర్జాతీయ రూట్లలో టికెట్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఎయిర్ ఇండియాతో సహా చాలా కంపెనీలు తమ కీలక రూట్లలో ధరలకు భారీ కోత పెట్టాయి. తక్కువ ధరకే సర్వీస్లను అందిస్తోంది. ఇతిహాద్ ఎయిర్లైన్ దూర ప్రయాణలైన ఢిల్లీ–పారిస్ టికెట్ను రూ.20,800 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యూరోపియన్ ఎయిర్లైన్ కంపెనీల కంటే దాదాపు రూ.25 వేలు తక్కువ.
ఢిల్లీ–న్యూయార్క్ రూట్లో ఎయిర్ ఇండియా ధరలు రూ.45 వేల నుంచి మొదలవుతుండగా, ఇండిగో రూ.46 వేలకి సర్వీస్ అందిస్తోంది. అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి కంపెనీల టికెట్ రేట్లు రూ.67 వేల దగ్గర ఉన్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఈ కంపెనీ బ్రాండ్పై నెగెటివ్ ప్రభావం పడింది. బుకింగ్స్ 30–35శాతం పడిపోయాయి. దీనికి స్పందనగా, ప్యాసింజర్ వాల్యూమ్ను తిరిగి పెంచుకోవడానికి, కీలక అంతర్జాతీయ స్లాట్లను రిటైన్ చేయడానికి ఎయిర్ ఇండియా భారీగా డిస్కౌంట్స్ ఇస్తోంది. ఢిల్లీ–దుబాయ్ రూట్లో చాలా ఎయిర్లైన్ కంపెనీల టికెట్ రేట్లు రూ.10 వేల దగ్గరలో ఉన్నాయి. ఇతిహాద్, ఎయిర్ అరేబియా వంటి కంపెనీలు కూడా తక్కువ రేట్లకే సర్వీస్లు అందిస్తున్నాయి.
ఢిల్లీ–హాంకాంగ్ ఫ్లైట్స్ ఇండిగోలో రూ.14 వేల కంటే తక్కువకు లభిస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఆఫర్ చేస్తున్న రూ.21వేల టికెట్ రేటు కంటే ఇది చాలా తక్కువ. మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న టెన్షన్ల వల్ల ఇరాన్, చుట్టుపక్కల ఎయిర్స్పేస్ను మూసేశారు. దీంతో ఎయిర్లైన్స్ సెంట్రల్ ఆసియా, కాస్పియన్ సీ, మెడిటరేనియన్ మీదుగా సుదీర్ఘమైన, ఖరీదైన రూట్లను తీసుకోవాల్సి వస్తోంది. ఈ డీటూర్స్ వల్ల ఇంధన ఖర్చులు, ఆపరేషనల్ ఖర్చులు పెరగొచ్చు. కొన్ని విమాన సర్వీస్లు ఆలస్యమవ్వొచ్చు.
8 ఎయిర్ ఇండియా సర్వీస్లు రద్దు..
మరోవైపు ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీస్లను రద్దు చేసింది. ఇందులో 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీస్లున్నాయి. కస్టమర్లకు రిఫండ్ ఇస్తామని, ఫ్రీ రీషెడ్యూల్ చేస్తామని కంపెనీ పేర్కొంది. జూన్ 21 నుంచి జులై 15 వరకు 3 విదేశీ మార్గాల్లోని విమాన సర్వీస్లను పూర్తిగా ఆపేశామని, 16 ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీస్లను తగ్గిస్తామని తెలిపింది.