
డల్లాస్ : స్త్రీలను గౌరవించే సమాజాలు మంచి గుర్తింపును పొందుతాయని, అభివృద్ధిలో మున్ముందుకు దూసుకుపోతాయని విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) వ్యవస్థాపకురాలు ఝాన్సీ అన్నారు. స్త్రీల అభ్యున్నతితోనే సామాజిక వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. WETA ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో ఆమె మాట్లాడారు. WETA సంస్థ మహిళా సాధికారతకు చేస్తున్న కృషిని, భవిష్యత్ ప్రణాళికలను ఈసందర్భంగా వివరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కారోల్టన్ సిటీ డిప్యూటీ మేయర్ నాన్సీ క్లైన్ హాజరై ప్రసంగించారు. సమాజ అభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేస్తే సంస్థ ద్వారా ఎంతోమంది మహిళలకు సేవ చేయగలమని, వారిని సశక్తులుగా తీర్చిదిద్దగలమని WETA అధ్యక్షురాలు శైలజా రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చర్ ఇచ్చిన వారిలో సంధ్య గవ్వ, శ్రీనివాస్ కవిత ఆకుల, సుమన గంగి, స్వాతి నేలభట్ల, నాగిని కొండేల, డా.శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. యాంకర్ మధు నెక్కంటి తన వాక్చాతుర్యంతో అందరినీ అలరించారు. మెహర్ చంటి లైవ్ బ్యాండ్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలైట్ అని చెప్పొచ్చు. WETA డల్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవ్యస్మృతి, ప్రతిమారెడ్డిలకు, కోర్ టీమ్ అనురాధ, హైమ అనుమాండ్ల, జయశ్రీ తేలుకుంట్ల, ప్రత్యూష నర్రపరాజు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వలంటీర్లు పాల్గొన్నారు.