
భారత రాష్ట్ర సమితిలో అంతర్గత సమస్యలను బహిర్గతం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. కవిత, తన తండ్రి నాయకత్వం, పార్టీ నిర్వహణ, రాజకీయ వ్యూహాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు. ఆ లేఖ బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభం ఉందనే అనుమానాలను రేకెత్తించేలా ఉంది. కేసీఆర్ నిజంగా సంక్షోభంలో ఉన్నారా? ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆయన ముందున్న కర్తవ్యం ఏమిటి? కవిత లేఖ ఒక అంతర్గత తిరుగుబాటా?
కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా కవిత ఒక అస్త్రం అందించారా? వివిధ కోణాల్లో విశ్లేషణలకు, భిన్నాభిప్రాయాలకు ఆమె అవకాశం ఇచ్చారు. కానీ, కవిత ఆ లేఖ ద్వారా ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకురాలిగా వ్యవహరించారు. అధికారం కోల్పోయిన పార్టీ, విధానాలు, నాయకుడి లక్షణాలపై ఆమె సంధించిన అంశాలపై లోతైన విశ్లేషణ జరగవలసిన అవసరం ఉన్నది.
కేసీఆర్ గురించి అందరికంటే తనకే బాగా తెలుసు. ధిక్కార ధోరణి, వ్యతిరేక భావజాలం ఉన్న ప్రతి నేతనూ మందాడి సత్యనారాయణరెడ్డి నుంచి మొదలు అనేకుల వరకు కేసీఆర్ బయటకి సాగనంపిన ఉదాహరణలు మన కళ్ళముందే ఉన్నాయి. అయినా రాజకీయాల్లో తెగింపు కూడా సమస్యలకు పరిష్కారం చూపుతుందన్న ధోరణిలో కవిత లేఖాంశాలున్నాయి. కేసీఆర్ ఈ లేఖతోనైనా మారతారా..? లేక కవితనే మారుస్తారా? అన్న సందేహాలూ లేకపోలేదు.
ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ వేదికపై మాట్లాడిన కేసీఆర్ అంశాలు ఆయన ప్రసంగం తాలూకు కవిత విశ్లేషణ అభిప్రాయం అభ్యంతరాలను నేరుగా చెబుతూనే ఆమె భావి రోజుల్లో పార్టీ ఎజెండాను సెట్ చేసేవిధంగా ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ దోస్తీ ఉందనే ఊహాగానాలు అందరికీ తెలిసినవే. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసిందని, ఇది పార్టీకి ప్రతికూలంగా మారిందని కవిత లేఖలో పేర్కొన్నారు.
అంతేకాక, సీనియర్ నేతలకు సభలో అవకాశం ఇవ్వకపోవడం, పార్టీ క్యాడర్కు యాక్సెస్ లేకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వంటి అంశాలపై కేసీఆర్ మౌనం వహించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్లో ఓ సాధారణ కార్యకర్త అంతర్గత అసంతృప్తిని బహిర్గతం చేసింది.
కేసీఆర్ సంక్షోభంలో ఉన్నారా?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, పదేళ్ల పాలనా వైఫల్యాలు, కాళేశ్వరం కమిషన్ విచారణ, కేసీఆర్ ఆరోగ్య సమస్యలు, కవిత జైలు యాత్ర, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వంటి వివాదాలు పార్టీని బలహీనపరిచాయి. ఈ నేపథ్యంలో కవిత లేఖ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలను బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు ఈ లేఖను ఆసరాగా చేసుకొని, బీఆర్ఎస్లో నియంతృత్వ వైఖరి, కుటుంబ రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఈ లేఖను కవిత రాయలేదని, ఇది బీఆర్ఎస్లోని ఒక వర్గం లేదా ప్రత్యర్థి పార్టీల కుట్ర కావొచ్చని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలు నిజమైతే, పార్టీలో అంతర్గత శక్తులు కేసీఆర్ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నాయని అర్థం.
అధిగమించే సామర్థ్యం కేసీఆర్కు ఉంది
కేసీఆర్ ఈ లేఖపై తీవ్రంగా స్పందించి, దాని లీక్పై ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పార్టీలో అసంతృప్తి, నాయకత్వంపై విశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలను సూచిస్తోంది. అయినప్పటికీ, కేసీఆర్ గతంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని, తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన నాయకుడు. ఈ లేఖ ఆయనను సంక్షోభంలోకి నెట్టినా, దాన్ని అధిగమించే సామర్థ్యం ఆయనకు ఉందని ఆయన అనుచరులు సంపూర్ణంగా భావిస్తున్నారు.
కేసీఆర్ ముందున్న కర్తవ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ముందున్న కర్తవ్యం స్పష్టమైన రాజకీయ వ్యూహం, పార్టీ ఐక్యతను కాపాడటం. కవిత లేఖలో సూచించినట్లు, తన నాయకత్వ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ నేతలకు, క్యాడర్కు కేసీఆర్ అందుబాటులో లేరనే ఫీడ్బ్యాక్ ఉంది. ఇకపై అందుబాటులో ఉండాలి. జడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను స్వీకరించడం ద్వారా పార్టీలో ఐక్యతను పెంపొందించాలి.
బీజేపీతో పొత్తు ఊహాగానాలను తిప్పికొట్టేందుకు, కేసీఆర్ బీజేపీపై బలమైన విమర్శలు చేయాలి. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ స్వతంత్ర గుర్తింపును బలోపేతం చేయాలి. బీజేపీపై స్పష్టమైన వైఖరి చాలా అవసరం కూడా. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లు వంటి అంశాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. ఈ అంశాలు తెలంగాణలో రాజకీయంగా కీలకమైనవి, వీటిని విస్మరించడం పార్టీకి నష్టం కలిగిస్తుంది. సామాజిక న్యాయ అజెండా లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం.
పార్టీ పునర్వ్యవస్థీకరణ
2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో కొత్త నాయకులకు అవకాశం కల్పించి, పార్టీని బలోపేతం చేయాలి. ఇది పార్టీకి, కేసీఆర్కు ఒక సవాలు అనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు పార్టీని పూర్తిగా బలహీనపరిచే సంక్షోభం కాకపోయినా.. కేసీఆర్ ఈ సవాళ్లను అవకాశంగా మలచుకుంటే, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ గత వైభవాన్ని సాధించగలదన్న వాదన బలంగా ఉంది. బీఆర్ఎస్కు పారదర్శకత అవసరం. ఈ లేఖ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలి. లేఖ నిజమైనదా కాదా అనే సందేహాలను తొలగించి, పార్టీలో ఐక్యత ఉందనే సందేశాన్ని కార్యకర్తలకు అందించాలి.
దూరదృష్టితోనే కవిత ఎజెండా?
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఆరు నెలలపాటు జైల్లో ఉన్న కవిత. బయటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు అనారోగ్య సమస్యల కారణంగా బయటికి రాలేదు. ఆ తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లు, బీసీలకు 42% కోటా, ఫూలె ఫ్రంట్ ఏర్పాటు చేయడం వంటి కీలకమైన అంశాలను ఎజెండాగా చేసుకొని తన సొంత సంస్థ భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికితోడు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆమె పరిణతి చెందిన, తెలంగాణ ప్రజల మనసెరిగిన నేతలా వ్యవ హరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆపరేషన్ సిందూర్పై బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పదేండ్లుగా ఏమేం చేయలేకపోయామనే ఆత్మవిమర్శ కవిత మాటల్లో ప్రస్ఫుటిస్తూ వస్తున్నది.
బీఆర్ఎస్ భవిష్యత్తుపై కవిత ప్రభావం
ఏదిఏమైనా కవిత తన లేఖలో లేవనెత్తిన అంశాలు బీఆర్ఎస్కు కీలకమే. ఒకవేళ కవిత మరొక పార్టీ పెడితే.. కాంగ్రెస్, బీజేపీలతో సమాన దూరం పాటించే పాత కండిషన్ బలహీనపడొచ్చేమో? ఎందుకంటే, కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ భవిష్యత్తును శాసించబోతున్నదని చెప్పొచ్చు. కాబట్టి కవితకు పార్టీలో ప్రాధాన్యమిచ్చి కాపాడుకోవడమే బీఆర్ఎస్కు మేలు. లేదంటే, బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు పట్ల అనేక రకాల ఊహాగానాలు వినవస్తున్నాయి.
బీఆర్ఎస్ సంక్షోభం ఎలాగూ పార్టీని ఒకటిగా ఉంచడం కష్టమే. దాంతో ఏమాత్రం చీలిక ఏర్పడినా, బీఆర్ఎస్ ఒక బలహీన పార్టీగా మారడం ఖాయం. కాబట్టి అదంతా కవిత తీసుకునే రాజకీయ నిర్ణయాలు, ఆమెకు పార్టీలో లభించే ప్రాధాన్యం బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మాత్రం చెప్పొచ్చు. కవిత తిరుగుబాటును, పార్టీ దిద్దుబాటుగా మార్చుకోవడమే అన్ని విధాలా మంచిదని కేసీఆర్ భావిస్తున్నారా లేదా అనేదానిపైనే ఏ విషయమైనా ఆధారపడి ఉంటుంది.
- వెంకట్ గుంటిపల్లి, సీనియర్ జర్నలిస్ట్-