చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని విమర్శిస్తే బుద్ది చెపుతాం: ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని విమర్శిస్తే బుద్ది చెపుతాం: ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి
  • అసలైన ఐఎన్టీయూసీ మాదే
  • ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి 

బషీర్​బాగ్, వెలుగు: అసలైన ఐఎన్టీయూసీ తమదని, యూనియన్​పై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఐఎన్టీయూసీ(ఆర్) జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి హెచ్చరించారు. ఐఎన్టీయూసీ(ఆర్) నేతలపై భౌతికదాడులకు పాల్పడడమే కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని విమర్శించిన కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ ముఠాకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

 సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఐఎన్టీయూసీ(ఆర్) రాష్ట్ర మహాసభల్లో కృష్ణమూర్తితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గూడ అయిలయ్య, జాతీయ కార్యదర్శి బి.అమర్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు సత్యదేవ్, మనోజ్ భట్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం టి.అంజయ్య, కాంగ్రెస్ అగ్రనేత జి.వెంకటస్వామి, మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి వంటి మహా నేతల ఆధ్వర్యంలో తాము పనిచేశామని, 15 ఏండ్లుగా రాష్ట్రంలోని కార్మిక హక్కుల గురించి పోరాటం చేస్తున్నామని కృష్ణమూర్తి చెప్పారు. 

జనక్ ప్రసాద్ ముఠా ఇతర సంఘాలతో కలిసి సింగరేణిలో ఐఎన్టీయూసీని బద్నామ్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డిదారిన ఐఎన్టీయూసీలో చేరి మనువాద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. పౌల్ట్రీ ఫారంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వని జనక్ ప్రసాద్ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత లేదని, తొలగించాలని డిమాండ్ చేశారు.  తెలంగాణతోపాటు  16 రాష్ట్రాలలో బలమైన కమిటీలు, రిజిస్టర్ట్ కార్మిక యూనియన్​లు పనిచేస్తున్నాయని, వారందరితో హైదరాబాద్ వేదిగకా భారీ సభ ప్లాన్​చేస్తున్నట్లు ప్రకటించారు.