సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రెవెన్యూ డివిజన్ పరిధిలో ‘మై హోమ్ సిమెంట్స్’ అక్రమ కట్టడాలను నిర్మిస్తున్న వ్యవహారంపై హుజూర్ నగర్ ఆర్డీవో వెంకారెడ్డి స్పందించారు. 113 ఎకరాల భూదాన్ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను ఆర్డీవో, తహసీల్దార్, సర్వేయర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లతో కూడిన బృందం పరిశీలించింది. వివాదాస్పద భూముల్లో మైహోమ్ నిర్మాణాలపై విచారణ జరిపింది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధీకులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
మేళ్లచెరువు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 1057లో ఉన్న 113 ఎకరాల భూదాన్ భూముల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలు, సిమెంట్ పరిశ్రమ విస్తరణ యూనిట్4 నిర్మాణ పనులను అధికారులు జులై 23న నిలిపివేశారు. అయితే అవసరమైన అనుమతులు పొందేందుకు మైహోం యాజమాన్యం అప్పట్లో రెండు రోజులు సమయం కోరింది. వారంలోగా అనుమతులు తీసుకోకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని అధికారులు ఆ రోజున హెచ్చరించారు.