లక్ష గొంతుకలు వందేమాతరం అని నినదించిన వేళ.. కోట్ల హృదయాలు జయహో అని జ్వలించిన సమయాన.. ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూసిన తరుణాన.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో.. అంగరంగ వైభవంగా జరిగిన ఐపీఎల్–15 ముగింపు వేడుకలతో ఘనంగా సెండాఫ్ చెబుతూ.. గుజరాత్ టైటాన్స్.. మెగా ట్రోఫీతో సగర్వంగా మెరిసింది..! లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే కప్ కొట్టి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది..! కెప్టెన్ కమ్ బ్యాటర్ కమ్ బౌలర్గా హార్దిక్ పాండ్యా (30 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 34; 3/17) త్రిపాత్రాభినయం మరోసారి సూపర్ హిట్ కావడం, శుభ్మన్ గిల్ (43 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 45 నాటౌట్) రాణించడంతో.. 131 రన్స్ టార్గెట్ను ఛేజ్ చేసిన గుజరాత్.. రాజస్తాన్కు చెక్ పెట్టింది..!!.
అహ్మదాబాద్: కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్–15లో గర్జించింది. లీగ్ దశ నుంచి మొదలుపెడితే.. నాకౌట్లోనూ తమకు తిరుగులేదని నిరూపిస్తూ తొలి టైటిల్తో గుబాళించింది. ఫలితంగా లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ టైమ్లోనే టైటిల్ నెగ్గిన తొలి టీమ్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. టార్గెట్ ఛేజింగ్లో పాండ్యా, గిల్ సమయోచితంగా రాణించడంతో.. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై గెలిచింది. టాస్ గెలిచిన రాజస్తాన్ 20 ఓవర్లలో 130/9 స్కోరు చేసింది. బట్లర్ (35 బాల్స్లో 5 ఫోర్లతో 39) టాప్ స్కోరర్. తర్వాత గుజరాత్ 18.1 ఓవర్లలో 133/3 స్కోరు చేసి నెగ్గింది. మిల్లర్ (19 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 32 నాటౌట్) చెలరేగాడు. పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, బట్లర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.
హార్దిక్ టర్నింగ్..
ముందుగా బ్యాటింగ్కు వచ్చిన రాజస్తాన్ ఇన్నింగ్స్.. తొలి 8 ఓవర్లకు మెరుగైన స్థితిలోనే కొనసాగింది. కానీ 9వ ఓవర్లో బౌలింగ్కు దిగిన హార్దిక్ ఒక్కసారి మ్యాచ్ను జీటీ వైపు తీసుకెళ్లాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (22) ఓ ఫోర్, రెండు సిక్సర్లతో ఫామ్లో కనిపించినా నాలుగో ఓవర్లో ఔటయ్యాడు. తొలి వికెట్కు 31 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఫోర్తో ఖాతా మొదలుపెట్టిన బట్లర్ తన నేచురల్ గేమ్కు విరుద్ధంగా ఆడి ఫెయిలయ్యాడు. శాంసన్ (14) ఓ రెండు ఫోర్లతో స్పార్క్ చూపినా 9వ ఓవర్లో పాండ్యాకు వికెట్ ఇవ్వడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. బట్లర్తో రెండో వికెట్కు 29 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. పవర్ప్లేలో 44/1తో ఉన్న స్కోరు 71/2కు పెరిగింది. కానీ ఇక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లు పడటంతో రాయల్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. 12వ ఓవర్లో రషీద్ (1/18) దెబ్బకు పడిక్కల్, నెక్స్ట్ ఓవర్లో పాండ్యా జోరుకు బట్లర్ పెవిలియన్ చేరడంతో రాయల్స్ స్కోరుకు కళ్లెం పడింది. ఇక 15వ ఓవర్ లాస్ట్ బాల్కు పాండ్యా.. హెట్మయర్ (11)ను ఔట్ చేయగా, ఐదు బాల్స్ తర్వాత సాయి కిశోర్ (2/20).. అశ్విన్ (6)ను వెనక్కి పంపాడు. ఈ దశలో పరాగ్ (15) నిలకడగా ఆడినా, కిశోర్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన బౌల్ట్ (11).. 18వ ఓవర్లో వెనుదిరిగాడు. ఈ ఓవర్ లాస్ట్ బాల్ను మెకే (8) సిక్సర్గా మలిచాడు. షమీ (1/33) వేసిన లాస్ట్ ఓవర్లో మెకే, పరాగ్ ఔటయ్యారు. లాస్ట్ 10 ఓవర్లలో 59 రన్సే చేసిన రాజస్తాన్ 7 వికెట్లు కోల్పోవడంతో చిన్న టార్గెట్ను నిర్దేశించింది.
నిలకడగా ఛేదన..
టార్గెట్ చిన్నదే అయినా.. రాజస్తాన్ బౌలర్లు బాగా పోరాడారు. స్టార్టింగ్లో బౌల్ట్ (1/14), ప్రసిధ్ (1/40) సూపర్ బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ఫలితంగా సెకండ్ ఓవర్లోనే సాహా (5) ఔటయ్యాడు. గిల్ నెమ్మదిగా ఆడినా, వేడ్ (8) సిక్సర్తో టచ్లోకి వచ్చాడు. కానీ ఐదో ఓవర్లోనే బౌల్ట్కు వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో 23 రన్స్కే 2 వికెట్లు కోల్పోయిన జీటీ ఇన్నింగ్స్ను ఆదుకునే బాధ్యత పాండ్యా, గిల్పై పడింది. బౌండ్రీలు రాక రన్రేట్ కూడా మందగించింది. 9వ ఓవర్లో చెరో ఫోర్తో కాస్త జోష్ తెచ్చినా.. ఫస్ట్ టెన్లో స్కోరు 54/2గానే ఉంది. తర్వాతి ఓవర్లో ఓ ఫోర్ వచ్చినా.. 12వ ఓవర్ (అశ్విన్)పాండ్యా 4, 6తో 15 రన్స్ రాబట్టాడు. కానీ 14వ ఓవర్లో చహల్ (1/20) వేసిన క్లాసిక్ లెగ్ స్పిన్ బాల్కు పాండ్యా స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో థర్డ్ వికెట్కు 63 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో గిల్ సింగిల్స్ తీసినా.. మిల్లర్ 4, 6, 4, 4తో హిట్లర్గా మారాడు. దీంతో జీటీ విజయానికి 18 బాల్స్లో 9 రన్స్ అవసరమయ్యాయి. మెకే బౌలింగ్ (19వ ఓవర్)లో గిల్.. విన్నింగ్ సిక్సర్ కొట్టి జీటీని చాంపియన్గా నిలిపాడు.
స్కోరు బోర్డు
రాజస్తాన్: జైస్వాల్ (సి) సాయి కిశోర్ (బి) యష్ దయాల్ 22, బట్లర్ (సి) సాహా (బి) పాండ్యా 39, శాంసన్ (సి) సాయి కిశోర్ (బి) పాండ్యా 14, పడిక్కల్ (సి) షమీ (బి) రషీద్ 2, హెట్మయర్ (సి అండ్ బి) పాండ్యా 11, అశ్విన్ (సి) మిల్లర్ (బి) సాయి కిశోర్ 6, పరాగ్ (బి) షమీ 15, బౌల్ట్ (సి) తెవాటియా (బి) సాయి కిశోర్ 11, మెకే (రనౌట్) 8, ప్రసీధ్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 2, మొత్తం: 20 ఓవర్లలో 130/9. వికెట్లపతనం: 1–31, 2–60, 3–79, 4–79, 5–94, 6–98, 7–112, 8–130, 9–130. బౌలింగ్: షమీ 4–0–33–1, దయాల్ 3–0–18–1, ఫెర్గుసన్ 3–0–22–0, రషీద్ ఖాన్ 4–0–18–1, హార్దిక్ 4–0–17–3, సాయి కిశోర్ 2–0–20–2.
గుజరాత్: సాహా (బి) ప్రసిధ్5, గిల్ (నాటౌట్) 45, వేడ్ (సి) పరాగ్ (బి) బౌల్ట్ 8, పాండ్యా (సి) జైస్వాల్ (బి) చహల్ 34, మిల్లర్ (నాటౌట్) 32, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 18.1 ఓవర్లలో 133/3. వికెట్లపతనం: 1–9, 2–23, 3–86. బౌలింగ్: బౌల్ట్ 4–1–14–1, ప్రసిధ్ 4–0–40–1, చహల్ 4–0–20–1, మెకే 3.1–0–26–0, అశ్విన్ 3–0–32–0.
ఈ కప్పు మాకు చాలా ప్రత్యేకం. మా ఆటతో జట్టుకు ఘన వారసత్వం ఏర్పరచాలని అనుకున్నాం. రాబోయే తరాలు మా గురించి మాట్లాడుకోవాలని భావించాం. ఈ విజయంలో ప్లేయర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ పాత్ర కూడా గొప్ప. కిర్స్టన్, ఆశీష్ నెహ్రా, ఆశీష్ కపూర్ అన్ని సమయాల్లో మా వెన్నంటి నిలిచారు. జట్టులో ప్రతి ఒక్కరూ సమష్టిగా ఆడితే అద్భుతాలు సృష్టించొచ్చని అనేందుకు మా విజయమే సరైన ఉదాహరణ.
- హార్దిక్ పాండ్యా
అతి పెద్ద జెర్సీతో గిన్నిస్ రికార్డు
ఐపీఎల్ 15 సీజన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో వరల్డ్ లార్జెస్ట్ జెర్సీని ప్రదర్శించారు. తెల్ల రంగులో ఉన్న ఈ జెర్సీ వెనుకభాగంలో.. ‘15 ఇయర్ ఆఫ్ ఐపీఎల్’ అని ముద్రించారు. దాని కింద పది జట్ల లోగోలు ఉంచారు.