ముంబై: ఐపీఎల్ 15వ సీజన్ లో తొలి డబుల్ ధమాకాకు వేళైంది. ఆదివారం రెండు మ్యాచ్ల డబుల్ హెడర్ ఫ్యాన్స్కు డబుల్ మజా ఇవ్వనుంది. బ్రౌబర్న్ స్టేడియంలో మధ్యాహ్నం మొదలయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఇప్పటివరకు టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనుంది. రాత్రి జరిగే మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ నాలుగు జట్లూ విక్టరీతో కొత్త సీజన్ను షురూ చేయాలని ప్లాన్స్ రెడీ చేసుకున్నాయి. టాప్ టీమ్స్ అయిన ముంబై, ఢిల్లీ మధ్య పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. వేలానికి ముందే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ బుమ్రా, పొలార్డ్లను రిటైన్ చేసుకున్న ముంబై.. ఈసారి వీరిపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. సూర్యకుమార్ లేకపోవడంతో అతడి ప్లేస్ లో ఫాబియాన్ అలెన్ ను తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే చాన్సుంది. ఇక, పంత్ కెప్టెన్సీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఢిల్లీ.. పావెల్, సర్ఫరాజ్ ఖాన్ లతో పాటు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లతో బరిలో దిగబోతుంది.
కొత్త కెప్టెన్లకు మొదటి పరీక్ష
కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ కెప్టెన్సీలో ఇన్నాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న బెంగళూరు ఈ సారి డుప్లెసిస్ నాయకత్వంలో బరిలో దిగబోతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ను కూడా కొత్త కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నడిపిస్తున్నాడు. కొత్త కెప్టెన్ల పరీక్షలో ఎవరు నెగ్గుతారో చూడాలి. మ్యాక్స్ వెల్ లేకుండానే ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. దీంతో బ్యాటింగ్ లో కోహ్లీతో పాటు డుప్లెసిస్, కార్తీక్ పై భారం పడనుంది. మరోవైపు పంజాబ్ కూడా స్టార్ ప్లేయర్లు రబాడ, బెయిర్ స్టో లేకుండానే తొలి పోరుకు సిద్ధమైంది. ఓపెనర్ శిఖర్ ధవన్, హిట్టర్ షారుక్ ఖాన్పై ఫోకస్ ఉంది.