- రాణించిన అనూజ్, హర్షల్, కోహ్లీ
- రోహిత్ సేనకు వరుసగా నాలుగో ఓటమి
పుణె: ఐదుసార్లు టైటిల్ నెగ్గినా.. ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం హ్యాట్రిక్ విజయాలతో లీగ్లో దూసుకుపోతున్నది. తాజాగా ఈ రెండు జట్ల మధ్య శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ముంబైపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 151/6 స్కోరు చేసింది. సూర్యకుమార్ (37 బాల్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 నాటౌట్) దంచికొట్టినా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత బెంగళూరు 18.3 ఓవర్లలో 152/3 స్కోరు చేసి గెలిచింది. అనూజ్ రావత్ (47 బాల్స్ లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 66), విరాట్ కోహ్లీ (36 బాల్స్ లో 5 ఫోర్లతో 48) మెరుపులు మెరిపించారు. అనూజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఢమాల్.. జిగేల్
ఓపెనర్లు రోహిత్ (26), ఇషాన్ కిషన్ (26) ధాటికి ముంబై పవర్ ప్లే స్కోరు 49/0. దీంతో స్కోరు ఈజీగా200 దాటుతుందని అంచనా వేశారు. కానీ ఓపెనర్లతో పాటు12 రన్స్ వ్యవధిలోనే బ్రెవిస్ (8), పొలార్డ్ (0), తిలక్ వర్మ (0) ఔట్ కావడంతో ముంబై 10 ఓవర్లలోనే 62/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో 17 రన్స్ తర్వాత రమణ్ దీప్ (6) కూడా వెనుదిరగడంతో 79/6తో నిలిచిన ఈ జట్టు 100 కూడా దాటేలా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్, ఉనద్కత్ (13 నాటౌట్) రాణించారు. 18వ ఓవర్లో రెండు ఫోర్లతో పాటు 19వ ఓవర్ ఫస్ట్ బాల్ సిక్స్ బాదిన సూర్య లీగ్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అదే ఓవర్లో మరో రెండు సిక్స్ లు బాదిన అతడు చివరి ఓవర్లోనూ ఓ సిక్సర్తో స్కోర్ ను 150 దాటించాడు.
ఈజీగా..
టార్గెట్ ఛేజింగ్ లో బెంగళూరు ఓపెనర్లు మంచి పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. కెప్టెన్ డుప్లెసిస్ (16) నెమ్మదిగా ఆడగా, అనూజ్ రావత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి ఆర్ సీబీ స్కోర్ 30/0. అయితే 9వ ఓవర్లో డుప్లెసిస్ ను ఔట్ చేసిన ఉనద్కత్ 50 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు. తర్వాత వచ్చిన కోహ్లీ అనూజ్ కు జత కలిశాడు. వీరిద్దరూ ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి బెంగళూరు స్కోరు 61/1. 14వ ఓవర్లో సింగిల్ తో రావత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 15వ ఓవర్లో కోహ్లీ క్యాచ్ ను బ్రెవిస్ మిస్ చేయడంతో ఆర్ సీబీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికి 15 ఓవర్లలో బెంగళూరు స్కోరు 111/1. ఈ టీమ్ విక్టరీకి చివరి 30 బాల్స్ లో 41 రన్స్ అవసరం కాగా, ఆర్ సీబీ బ్యాటర్లు జోరు పెంచారు. 17వ ఓవర్లో అనూజ్ ఔట్ కావడంతో దినేశ్ కార్తీక్ (7 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. 18వ ఓవర్ చివరి బంతికి కార్తీక్ సిక్స్ బాదడంతో సమీకరణం 12 బాల్స్లో 8రన్స్ గా మారింది. కానీ తర్వాతి ఓవర్లో బ్రెవిస్ బౌలింగ్లో కోహ్లీ ఔటయ్యాడు. ఆపై వచ్చిన మ్యాక్స్ వెల్ (8 నాటౌట్) 6,4తో బెంగళూరుకు విక్టరీ ఖాయం చేశాడు.