- హైదరాబాద్పై 12 రన్స్తో లక్నో గెలుపు
- రాణించిన రాహుల్, హుడా, అవేశ్
ముంబై: పోయినేడాది చివరి ప్లేస్లో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 15వ సీజన్లోనూ నిరాశ పరుస్తోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన రైజర్స్ బోణీ కొట్టలేకపోయింది. 17 బాల్స్లో 27 రన్స్ చేయాల్సిన టైమ్లో చేతిలో ఆరు వికెట్లున్నా విజయం సాధించలేకపోయింది. మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బాల్స్ లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 68), దీపక్ హుడా (33 బాల్స్ లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) మెరుపులకు తోడు అవేశ్ ఖాన్ (4/24), జేసన్ హోల్డర్ (3/34) సూపర్ బౌలింగ్తో లక్నో సూపర్ జెయింట్స్ లీగ్లో రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిన మ్యాచ్లో లక్నో12 రన్స్ తేడాతో హైదరాబాద్ను ఓడించింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 169/7 స్కోర్ చేసింది.సుందర్ (2/28), నటరాజన్ (2/26), షెఫర్డ్ (2/42) తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్ లో సన్రైజర్స్ ఓవర్లన్నీ ఆడి 157/9 మాత్రమే చేసి ఓడిపోయింది. రాహుల్ త్రిపాఠి (30 బాల్స్ లో 5 ఫోర్లు 1 సిక్స్ తో 44) టాప్ స్కోరర్. అవేశ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆదుకున్న రాహుల్, హుడా
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో టాపార్డర్ను ప్రారంభంలోనే సన్ రైజర్స్ బౌలర్లు దెబ్బకొట్టారు. రెండో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ సుందర్ మ్యాజిక్ చేశాడు. తన వరుస ఓవర్లలో ఓపెనర్ డికాక్ (1), ఎవిన్ లూయిస్ (1)ను ఔట్ చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో ఫోర్, సిక్స్ తో జోరు చూపించిన మనీశ్ పాండే (11)ను షెఫర్డ్ ఔట్ చేయడంతో 27/3తో లక్నో ఇబ్బందుల్లో పడింది. కానీ కెప్టెన్ రాహుల్ తో కలిసిన దీపక్ హుడా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడారు. ఉమ్రన్ వేసిన పదో ఓవర్లో రాహుల్ రెండు ఫోర్లు, హుడా ఫోర్, సిక్స్తో గేరు మార్చగా.. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి లక్నో 68/3 స్కోర్ చేసింది. మిడిల్ ఓవర్లలోనూ హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే 15వ ఓవర్లో నటరాజన్ (2/26) బౌలింగ్ లో సింగిల్ తో దీపక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లోనే త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో నాలుగో వికెట్ కు 87 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. రాహుల్ కూడా 16వ ఓవర్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. రాహుల్ తో కలిసిన ఆయుష్ బదోని (19) చివర్లో దాటిగా ఆడాడు. 19వ ఓవర్లో రాహుల్ తో పాటు క్రునాల్ పాండ్యా (6)ను నటరాజన్ ఔట్ చేయగా.. షెఫర్డ్ వేసిన చివరి ఓవర్లో 17 రన్స్ రావడంతో లక్నో మంచి స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 169/7 (రాహుల్ 68, హుడా 51, సుందర్ 2/28, నటరాజన్ 2/26)
హైదరాబాద్: 20 ఓవర్లలో 157/9 (త్రిపాఠి 44, అవేశ్ 4/24, హోల్డర్ 3/34).
దెబ్బకొట్టిన అవేశ్..
ఛేజింగ్ లో నిలదొక్కుకోవాలని చూసిన సన్ రైజర్స్ ఓపెనర్లు విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ(13)కు అవేశ్ ఖాన్ రూపంలో విలన్ ఎదురయ్యాడు. ఫస్ట్ వికెట్ కు 25 రన్స్ జోడించిన అనంతరం నాలుగో ఓవర్లో విలియమ్సన్ ను ఔట్ చేసిన ఆవేశ్.. ఆరో ఓవర్లో అభిషేక్ ను వెనక్కి పంపి రైజర్స్ క్యాంప్లో గుబులు రేపాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 40/2తో నిలిచింది. ఆపై రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ (12) ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ముఖ్యంగా త్రిపాఠి బౌండరీలే లక్ష్యంగా స్ట్రోక్ ప్లేతో విరుచుకుపడ్డాడు. దీంతో 10 ఓవర్లకు సన్ రైజర్స్ 82/2 స్కోర్ చేసింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే మార్క్రమ్ ను క్రునాల్(2/27) పెవిలియన్ చేర్చాడు. తర్వాత త్రిపాఠితో కలిసి నికోలస్ పూరన్(34) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. 14వ ఓవర్లో క్రునాల్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడగా అది బిష్నోయ్ చేతుల్లో పడటంతో త్రిపాఠి ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (18), పూరన్ తో కలిసి దూకుడుగా ఆడటంతో 15 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ 120/4తో రేసులో నిలిచింది. తర్వాతి రెండు ఓవర్లలో 17 రన్స్ రావడంతో సన్రైజర్స్ గెలిచేలా కనిపించింది. కానీ 18వ ఓవర్లో పూరన్ తో పాటు సమద్ (0)ను ఔట్ చేసిన అవేశ్ 7 రన్సే ఇవ్వడంతో సమీకరణం 12 బాల్స్ లో 26 రన్స్ గా మారింది. 19వ ఓవర్లో 10 రన్స్ రాగా.. చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి కేవలం 3 రన్సే ఇచ్చిన హోల్డర్.. లక్నోకు విక్టరీ అందించాడు.