- వేలంలో కొంటామని చెప్పి.. పట్టించుకోలేదు
- మరో టీమ్కు ఆడుతానని అనుకోలేదు: చహల్
ముంబై: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను వీడి మరో టీమ్కు ఆడుతానని అస్సలు ఊహించలేదని టీమిండియా, రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చెప్పాడు. ఈ సీజన్లో ఆర్సీబీ టీమ్లో ఉండేందుకు తాను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసిన వార్తలు అవాస్తమని కొట్టిపారేశాడు. వేలంలో తనను కొంటామని చెప్పిన బెంగళూరు ఫ్రాంచైజీనే మాట తప్పిందన్నాడు. ‘ఆర్సీబీతో ఎమోషనల్గా కలిసిపోయా. వేరే టీమ్ కు ఆడాల్సి వస్తుందని ఊహించలేదు. ఈ సీజన్లో ఆర్సీబీతో కలిసి ఉండేందుకు ఎక్కువ డబ్బులు ఎందుకు డిమాండ్ చేశావని సోషల్ మీడియాలో నన్ను చాలా మంది అడుగుతున్నారు. అది తప్పు. నేను అలా చేయలేదు. అసలు వేలానికి ముందు రిటెన్షన్ గురించి మేనేజ్ మెంట్ నాతో మాట్లాడలేదు. మా మధ్య ఫీజు గురించి చర్చే జరగలేదు. అయితే, ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసెన్ ఫోన్ చేసి ముగ్గురిని (కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజ్) రిటైన్ చేసుకుంటున్నామని చెప్పారు. నన్ను వేలంలో తిరిగి కొనుగోలు చేస్తామన్నారు. కానీ, వాళ్లు నా కోసం ఒక్క బిడ్ కూడా వేయలేదు. నన్ను రిటైన్ చేసుకోండని ఫ్రాంచైజీని నేను అడగలేదు.. రిటైన్ చేసుకుంటామని వాళ్లూ చెప్పలేదు. ఒకవేళ నన్ను రిటైన్ చేసుకుంటామని అడిగితే కచ్చితంగా ఒప్పుకునేవాడిని. ఆర్సీబీతో అనుబంధమే నాకు ముఖ్యం. డబ్బు తర్వాతి విషయం. ఏదేమైనా నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆర్సీబీతో పాటు ఆ టీమ్ ఫ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు టీమ్ మారినా నా పెర్ఫామెన్స్ లో తేడా ఉండదు. ఇది నాకు కొత్త ప్రయాణం. బెంగళూరుకు ఎలాంటి పెర్ఫామెన్స్ చేశానో ఇప్పుడు రాజస్తాన్ కు అలాగే చేస్తా. ఏదీ మారదు. ఎందుకంటే వేలంలో రాజస్తాన్ నాపై నమ్మకముంచింది’ అని చహల్ తెలిపాడు.