హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి (సీఈవో), రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో జనవరి 12వ తేదీ శుక్రవారం సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2014 నవంబర్ 1 నుంచి ఐదేండ్ల కాలానికి రెంటల్ అగ్రిమెంట్ తో ఒరుసు సాంబశివరావు, బన్వర్లాల్ ఇంటిని అందెకు తీసుకున్నాడు. భన్వర్ లాల్ 2019, జూన్ లో రిటైర్ అయిన తర్వాత అధికారిక నివాసం ఖాళీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లోని తన సొంతింటికి రావాలనుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం తన ఇంటిని ఖాళీ చేయాలని కోరగా సాంబశివరావు నిరాకరించాడు. అదే ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్కుమార్ కూడా అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న భన్వర్ లాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సాంబశివరావు, నవీన్కుమార్ కలిసి ఫోర్జరీ సంతకాలతో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తయారు చేసి.. భన్వర్లాల్ కుటుంబ సభ్యులకు లీగల్ నోటీస్ పంపించారు. దీంతో తమ ఇంటిని సొంతం చేసుకునేందుకు సాంబశివరావు, నవీన్ కుమార్ ప్రయత్నించారంటూ గత డిసెంబర్ 17న భన్వర్ లాల్ సతీమణి మణిలాల్ సిటీ సీసీఎస్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.
ఈ కేసులో నవీన్కుమార్ను సిటీ సీసీఎస్ పోలీసులు డిసెంబర్ 28వ తేదీ బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని సీసీఎస్కు తరలించి సాయంత్రం వరకు విచారించారు. అనంతరం 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. విచారణలో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్లు తేలడంతో ఐపీఎస్ నవీన్కుమార్ ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు.