
తన పిల్లల్ని చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ, అర్ధరాత్రి తన మాజీ భార్య ఇంటి ముందు ధర్నాకు దిగాడు ఓ ఐపీఎస్ అధికారి. పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెపినా వినకుండా.. తన ఇద్దరు పిల్లల్ని చూసేంతవరకు తాను అక్కడి నుంచి కదలనని.. ఆమె ఇంటి ముందే నిరసన చేపట్టాడు .
కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఇంటర్నల్ సెక్యూరిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ)గా పనిచేస్తున్నారు అరుణ్ రంగరాజన్ అనే వ్యక్తి. గతంలో ఛత్తీస్గఢ్లో పని చేస్తున్న సమయంలో జూనియర్ ఆఫీసర్గా పని చేస్తున్న మహిళను ప్రేమించి పెళ్లాడాడు. దీంతో బదిలీ మీద కర్ణాటక వచ్చారు. ఓ బిడ్డ పుట్టాక ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఆమెకు ఈలోగా మరో బిడ్డ పుట్టింది. ప్రస్తుతం ఆమె డీసీపీ హోదాలో పని చేస్తున్నారు.
చిన్నపిల్లలు కావడంతో కోర్టు బిడ్డల బాధ్యతను తల్లికి అప్పగించింది. రంగరాజన్ ఆదివారం పిల్లలను చూడ్డానికి బెంగళూరులోని వసంత్నగర్లో ఉంటున్న మాజీ భార్య ఇంటికెళ్లాడు. అయితే ఆమె అతణ్ని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు మూసేసింది. అతడు తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని రంగరాజన్ కు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ పోలీసులే కావడంతో, వారికి నచ్చజెప్పలేక మీరే తేల్చుకోవాలంటూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు పోలీసులు.