టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్ చేపట్టి చంపేయడంతో ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతుంది. ఈ క్రమంలోనే ఖమేనీ హత్యకు ఇరాన్ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాలు దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై ఏక కాలంలో అటాక్స్ చేస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఎటాక్ చేసింది.
ఈ ఘటనలో ఎయిర్ పోర్టు స్వల్పంగా ధ్వంసమైంది. ఖమేనీ హత్య తర్వాత దుబాయ్లో అత్యంత ఎత్తైన బుర్జా ఖలీఫా టవర్పై మరోసారి దాడికి యత్నించింది. అలాగే, లెబనాన్లోని యూఎస్ ఎంబసీపై విరుచుకుపడింది. ఇదే సమయంలో బహ్రెయిన్లోని మనామాలో క్రౌన్ ప్లాజా హోటల్పై డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో హోటల్ ధ్వంసమైంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది.
ఆయా దేశ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణాన ఎటునుంచి ఏ బాంబు వచ్చి మీదపడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వార్ ఎఫెక్ట్ మిడిల్ ఈస్ట్లో విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా దేశాలు ఎయిర్ స్పేస్లను క్లోజ్ చేసి ఎయిర్ పోర్టులను మూసివేశాయి. ఇరాన్ దాడులతో నిత్యం ప్రయాణీకుల రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఖతార్ ఎయిర్ పోర్టులు కూడా మూతబడ్డాయి.
