- అమెరికా ప్రతిపాదనలు అతిగా ఉన్నయ్: అరాఘ్చీ
టెహ్రాన్: అమెరికా ప్రతిపాదనను ఇరాన్ సమీక్షిస్తోందని.. కానీ, వాషింగ్టన్తో చర్చలేవీ మొదలు కాలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చేసిన ప్రతిపాదన ఇరాన్ ఉన్నత నాయకత్వం పరిశీలనలో ఉందని.. పలువురు మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్ సందేశాలు పంపుతోందని అరాఘ్చీ ధ్రువీకరించారు. కానీ, టెహ్రాన్ దీనిని అధికారిక చర్చలుగా భావించడం లేదని స్పష్టం చేశారు.
అలాగే.. అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని కూడా అరాఘ్చీ పేర్కొన్నారు. ఇరాన్ తన దృఢత్వాన్ని ప్రదర్శించిందని, ఏ దేశమూ దాని భద్రతకు ముప్పు కలిగించలేదని ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. అలాగే, ఇరాన్ సుదీర్ఘ సంఘర్షణను కోరుకోవడం లేదని.. కానీ, షరతులపై శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటోందని అరాఘ్చీపేర్కొన్నారు.
కాగా, అమెరికా ప్రతిపాదనలు అతిగా ఉన్నాయని, యుద్ధం ముగింపు సమయాన్ని నిర్దేశించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అనుమతించబోమని అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం ఎప్పుడు ముగించాలో ఇరాన్మాత్రమే నిర్ణయించుకుంటుందని పేర్కొన్నారు.
