టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, పాకిస్తాన్కు వెళ్తున్న ఒక కంటైనర్ నౌకను ఇరాన్ దళాలు హార్మూజ్ జలసంధి వద్ద నిలిపివేశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా నుంచి కరాచీకి ప్రయాణిస్తున్న ‘సెలెన్’ అనే నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వెనక్కి పంపించివేసింది. సరైన అనుమతులు లేవనే కారణంతో ఈ చర్యకు పూనుకుంది.
ఈ మేరకు ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా తంగ్సరి ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, హార్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి ముందస్తు అనుమతి లేకపోవడంతో ‘సెలెన్’ అనే నౌకను అడ్డుకున్నాం” అని తెలిపారు. ఈ జలసంధి గుండా వెళ్లే ఏ నౌక అయినా ఇరాన్ కోస్ట్ గార్డ్ అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలను అనుమతిస్తామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. అయితే, పాకిస్తాన్కు ఇంధనం, ఇతర వస్తువులతో వెళ్తున్న ఈ నౌక, ఇరాన్కు ముందస్తు నిబంధనల ప్రకారం సమాచారం అందించలేదని పేర్కొంది.
