- అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
- ఇరాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం..
- శాంతి చర్చలు అద్భుతంగా జరుగుతున్నాయి
- యుద్ధంలో మేమే గెలిచాం..
- హార్మూజ్ విషయంలో చర్యలకు సిద్ధమని వెల్లడి
- -తాము ఎలాంటి అభ్యర్థన చేయలేదన్న ఇరాన్
- పశ్చిమాసియా వైపు మరో 10 వేల అమెరికా సైనిక దళాలు
- చర్చలు కొనసాగుతున్నాయంటూనే ఫైటర్ జెట్ల తరలింపు
- ఇరాన్లోని పవిత్ర నగరం కోమ్పై
- భీకర దాడులు.. ఆరుగురు మృతి
- 850కి పైగా టోమాహాక్ క్షిపణులను
- అమెరికా ప్రయోగించినట్టు నివేదిక
వాషింగ్టన్:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఎనర్జీ సెక్టార్పై చేపట్టాలనుకున్న దాడులను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ సర్కారు అభ్యర్థన మేరకే తాను ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టారు. యుద్ధం ముగింపునకు సంబంధించి ఇరాన్తో చర్చలు అద్భుతంగా కొనసాగుతున్నాయని వివరించారు. చర్చల్లో పురోగతి కనిపిస్తున్నదని చెప్పారు. వీటిపై మీడియాల్లో వస్తున్న ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కాగా, ఫిబ్రవరి 28నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలని ఇరాన్కు ట్రంప్ ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో వెనక్కితగ్గిన ట్రంప్.. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశ ఎనర్జీ సెక్టార్, విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ దాడుల నిలిపివేతను మరో 10 రోజుల వరకు పొడిగించారు.
ఇరాన్పై భూతల దాడికి అమెరికా సిద్ధం?
ఇరాన్పై భూతల దాడికి అమెరికా సిద్ధమవుతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) సుమారు 10 వేల మంది అదనపు సైనికులను పశ్చిమాసియాకు పంపే ఆలోచనలో ఉన్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదించింది. ఓ వైపు ఇరాన్పై యుద్ధ తీవ్రతను తగ్గిస్తామంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోవైపు భారీగా సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్న 5 వేల మంది మెరైన్ ఎక్స్పీడిషనరీ యూనిట్(ఎంఈయూ) సభ్యులు, వెయ్యి మంది పారాట్రూపర్లతో కలిసి ఈ సిబ్బంది రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. సైన్యంతోపాటు అత్యాధునిక ఫైటర్ జెట్లు, విమాన వాహన నౌకలను కూడా పశ్చిమాసియాకు అమెరికా తరలిస్తున్నది. ఈ దళాలను ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్లోని కీలకమైన ఖర్గ్ ద్వీపం సమీపంలో మోహరించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇరాన్తో సాగుతున్న యుద్ధంలో అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన 850కి పైగా టోమాహాక్ క్షిపణులను ప్రయోగించినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు తీవ్రరూపం దాల్చుతున్నది అనేందుకు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.
హార్మూజ్ను తెరిపిస్తాం..
హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ట్రంప్ వెల్లడించారు. మిత్ర దేశాల మద్దతు ఉన్నా, లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకే జీవనాడి అయిన హార్మూజ్ను తిరిగి తెరిపించడానికి అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరాన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకే ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేత గడువును పొడిగించామని చెప్పారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లేదా తన 15 అంశాల ప్రతిపాదనకు అంగీకరించడంపై ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల వరకు ఇరాన్కు సమయం ఉందని చెప్పారు. సైనిక పరంగా ఇరాన్పై అమెరికా ఇప్పటికే విజయం సాధించిందని, ఇరాన్ నౌకాదళం, క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీశామని ప్రకటించారు. అయితే, ట్రంప్ను తాము ఎలాంటి గడువు కోరలేదని మధ్యవర్తుల ద్వారా ఇరాన్ స్పష్టం చేసింది.
ఇరాన్ పవిత్ర నగరం కోమ్పై భీకర దాడులు
ఇరాన్-–అమెరికా యుద్ధం క్షేత్రస్థాయిలో మరింత భీకరంగా మారుతున్నది. ఇరాన్లోని పవిత్ర నగరంగా పరిగణించే కోమ్లోని నివాస ప్రాంతాలపై అమెరికా–-ఇజ్రాయెల్ దళాలు జరిపిన తాజా దాడుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కోమ్ నగరంలోని ‘పర్దీసాన్’ ఏరియాలోని 3 నివాస భవనాలపై క్షిపణుల వర్షం కురిసింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన అధునాతన ‘బి-2 స్పిరిట్’ స్టెల్త్ బాంబర్లను భారీ స్థాయిలో ప్రయోగించారని ఇరాన్ మీడియా ఆరోపిస్తున్నది. ఈ నెల 3న కూడా కోమ్లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అప్పట్లో కూడా ఆరుగురు మరణించినట్లు నివేదికలు వచ్చాయి. కాగా, ఈ దాడులను ‘మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు’గా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అభివర్ణించారు. దీనిపై యూఎన్వో మానవ హక్కుల మండలిలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
యూఎస్ కరెన్సీపై ఇక ట్రంప్ సైన్
అమెరికా ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకోబోతున్నది. 250వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ(జులై4) వేడుకల సందర్భంగా..ఇకపై కొత్తగా ముద్రించే 100 డాలర్ల నోట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండబోతున్నదని ఆ దేశ ట్రెజరీ విభాగం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది అమలైతే కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు.1861(దాదాపు 165 ఏండ్లుగా) నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై 'ట్రెజరర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్' సంతకం ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు పక్కనపెట్టి ట్రెజరర్ సంతకం స్థానంలో అధ్యక్షుడి సిగ్నేచర్ చేరుస్తున్నారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్తో పాటు ట్రంప్ సిగ్నేచర్ ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను వచ్చే జూన్లో ముద్రించనున్నట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ పేర్కొంది. అనంతరం మిగిలిన అన్ని డినామినేషన్ల నోట్లపై కూడా అధ్యక్షుడి సంతకాలు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం కరెన్సీ నోట్లు మాత్రమే కాకుండా.. జూలై 4 నుంచి ట్రంప్ ముఖచిత్రంతో కూడిన 24 క్యారెట్ల బంగారు స్మారక నాణేన్ని కూడా విడుదల చేయడానికి ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశం సాధించిన ఆర్థిక విజయాలతోపాటు 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఇది అమెరికా గర్వించదగ్గ చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. దీనిపై ట్రెజరర్ బ్రాండన్ బీచ్ స్పందిస్తూ..దేశానికి అధ్యక్షుడు ట్రంప్ చేసిన సేవలకు ఇది తగిన గుర్తింపు అని ప్రశసించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లపై మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, ట్రెజరర్ లిన్ మాలెర్బా సంతకాలు ఉన్నాయి. అయితే, మాలెర్బా సంతకంతో కరెన్సీ ముద్రణ ఇకపై ఆగిపోనుంది.
మోదీ, నేనూ చేతల మనుషులం
ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ, తాను చేతల మనుషులమని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాల నేతల కంటే మోదీ, తాను చాలా భిన్నమని.. తామిద్దరం అనుకున్నది మొండిగా సాధిస్తామని చెప్పారు. భారత్తో అమెరికాకు ఉన్న సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ మేరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్లోని అమెరికా ఎంబసీ ఎక్స్ లో శుక్రవారం పోస్ట్ చేసింది. "భారత్తో మా అద్భుతమైన సంబంధం రాబోయే రోజుల్లో మరింత బలోపేతమవుతుంది. ప్రధాని మోదీ, నేనూ మాటల మనుషులం కాదు.చేతల మనుషులం.అనుకున్న పనులను మొండిగా చక్కబెట్టేవాళ్లం. ఈ మాట ఎవరికిపడితే వారికి వర్తించదు" అని ట్రంప్ పేర్కొన్నట్లు యూఎస్ ఎంబసీ ట్వీట్ చేసింది. మంగళవారం మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తగ్గి, త్వరగా శాంతి నెలకొనాలని భారత్ బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతామని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి మార్గం తెరిచి ఉండటం అత్యంత అవసరమని ప్రధాని పేర్కొన్నారు.
మళ్లీ తెరపైకి ‘పెంటగాన్ పిజ్జా థియరీ’!
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం(పెంటగాన్)లో పిజ్జా ఆర్డర్లు భారీగా పెరగడంతో ఇరాన్ పై అమెరికా భూతల దాడికి సిద్ధమవుతోందన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. గురువారం రాత్రి పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు ఆర్డర్లు ఒక్కసారిగా పెరిగాయి. పాపా జాన్స్ లో 296%, డోమినోస్ లో 208%, పిజాటోలో 200% ఆర్డర్లు పెరిగాయి. పెంటగాన్ లో అధికారులు అర్ధరాత్రి వరకు పని చేస్తూ, భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారంటే.. ప్రపంచంలో ఏదో ఓ మూల భారీ సైనిక చర్యకు ప్రణాళికలు జరుగుతున్నాయని భావిస్తారు. గతంలో ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పిజ్జా ఇండెక్స్ గరిష్ట స్థాయిలో ఉండటంతో ‘పెంటగాన్ పిజ్జా థియరీ’ మరోసారి తెరపైకి వచ్చింది.
