- ఇతర కేసులు కూడా ముఖ్యమే కదా: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : కరోనాపై రెండేండ్ల కింద దాఖలైన పిల్స్ను ఇంకెంత కాలం విచారణ చేయాలని, ఇతర కేసుల విచారణ కూడా ముఖ్యమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనాపై 2020లో దాఖలైన పిల్స్పై బుధవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టాల్సిన ముఖ్యమైన పెండింగ్ కేసులు చాలా ఉన్నాయని, ప్రజలకు కరోనాపై అవగాహన వచ్చిన నేపథ్యంలో పిల్స్ పై విచారణ ముగిస్తామని కోర్టు తెలిపింది. దీనిపై న్యాయవాదులు ఎల్.రవిచందర్, చిక్కుడు ప్రభాకర్ స్పందిస్తూ.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా పరిస్థితిని సమీక్షిస్తూ..ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.