
నిరుద్యోగుల డబ్బులు తిరిగివ్వాలి లేకపోతే ఇంద్రకరణ్రెడ్డి ఇంటి ఎదుట బైఠాయిస్తాం
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఉద్యోగాల నియామకాల విషయంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి న్యాయ విచారణకు సిద్ధమేనా అని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం నిర్మల్ లో మాట్లాడుతూ అమాయక నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగివ్వాలని, లేకపోతే బాధితులతో కలిసి మంత్రి ఇంటి ఎదుట బైఠాయిస్తామన్నారు. మున్సిపల్ ఉద్యోగాలు ఇస్తామని మంత్రి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు. అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో న్యాయం దక్కి నియామకాలు రద్దయ్యాయన్నారు.
ఆశావహుల నుంచి తన అనుచరుల ద్వారా డబ్బులు తీసుకొని ఇప్పుడు సాక్షాలు ఉన్నాయా అని అడగడం ఆయనకే చెల్లిందన్నారు. ఇప్పటికైనా మంత్రి తన తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, ముత్యంరెడ్డి, ఆనందరావు పటేల్, చందు పాల్గొన్నారు.