హైదరాబాద్,వెలుగు: ఇండియాలో స్కూల్ క్రికెటర్లు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఓ వేదికను అందించడంతో పాటు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ మార్గనిర్దేశంలో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ) ఏర్పాటైంది. టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు, సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది స్టూడెంట్లను ప్రోత్సహించడమే తమ బోర్డు ప్రధాన లక్ష్యమని ఐఎస్బీసీ ఫౌండర్, సీఈవో కె. సునీల్ బాబు చెప్పారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎస్బీఏ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. తమ బోర్డుకు వెంగ్సర్కార్ చీఫ్ అడ్వైజర్గా, ఎంపీ, బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చీఫ్ ప్యాట్రన్గా వ్యవహరిస్తారని తెలిపారు.
‘వెంగ్సర్కార్ గైడెన్స్లో జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు, ట్రెయినింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఇండియన్ స్కూల్స్ టాలెంట్ లీగ్ నిర్వహిస్తాం. ఐసీసీ అనుబంధ దేశాలతో కలిసి 2023 చివర్లో స్కూల్ వరల్డ్ కప్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం. మా కార్యకలాపాలను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఐఎస్బీసీలో స్టూడెంట్స్తో పాటు స్కూల్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు’ అని సునీల్ చెప్పారు. ఇక, తనతో పాటు గావస్కర్, సచిన్ స్కూల్ క్రికెట్ టోర్నీల ద్వారానే వెలుగులోకి వచ్చారని వెంగ్సర్కార్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం క్రికెట్తో పాటు అన్ని క్రీడలను ప్రోత్సహించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చీఫ్ ప్యాట్రన్ కె. లక్ష్మణ్ అన్నారు.