
టీమిండియా బౌలర్ మహ్మద్ షమీపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలపై భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అంశంపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ నీరజ్ కుమార్ తనతో పాటు...టీమిండియా ఆటగాళ్లను విచారించారని వెల్లడించాడు. డబ్బు కోసం షమీ ఫిక్సింగ్ పాల్పడ్డాడా అని తమపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలిపాడు. కానీ తాను మాత్రం షమీ 200 శాతం ఫిక్సింగ్ చేయడని బలంగా చెప్పినట్లు వివరించాడు.
బీసీసీఐ యాంటీ కరప్షన్ బ్యూరో మమ్మల్ని సంప్రదించింది. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేయగలడా అని అనేక ప్రశ్నలు అడిగారు. తాను చెప్పిన వివరాలన్నింటినీ వారు రాసుకున్నారు. షమీ పర్సనల్ లైఫ్ గురించి తనకు తెలియదు కానీ 200 శాతం అతడు ఫిక్సింగ్ చేయలేడని నేను చెప్పాను. ఎందుకంటే షమీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు... అని ఇషాంత్ వివరించాడు.
ఫిక్సింగ్ ఆరోపణలు..
2018లో మహ్మద్ షమీపై అతని మాజీ భార్య హసీన్ జహాన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. షమీకి పాకిస్థాన్ అమ్మాయితో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆమె నుంచి భారీగా డబ్బులు తీసుకుంటూ మ్యాచ్ ఫిక్స్ంగ్ పాల్పడ్డాడని హసీన్ జహాన్ పేర్కొంది. 2018లో షమీపై హసీన్ జహాన్ గృహ హింస కేసును కూడా పెట్టింది.
క్లీన్ చిట్..
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను విచారించిన బీసీసీఐ షమీకి క్లీన్చీట్ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల వల్ల అతని కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే అవన్నీ అధిగమిస్తూ అద్భుత బౌలింగ్తో టీమిండియాలో స్థానాన్ని దక్కించుకున్నాడు.