హైదరాబాద్, వెలుగు: సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్పై సోమవారం ఇన్కం టాక్స్(ఐటీ), జీఎస్టీ అధికారులు రెయిడ్స్ చేశారు. హైదరాబాద్, ఏపీలో మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేశారు. జూబ్లీహిల్స్లోని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసు, ప్రొడక్షన్ హౌసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఈ దాడులు కొనసాగాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్, అకౌంట్ సెక్షన్స్కి చెందిన వాళ్లనే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోకి అనుమతించారు. ఏపీ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ కూడా తనిఖీల్లో పాల్గొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాల్లో పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట, రంగస్థలం, జనతాగ్యారేజ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాలకు పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై ఐటీ శాఖ వివరాలు రాబడుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్సింగ్ సినిమా పెట్టుబడులపైనా ఆరా తీసినట్లు తెలిసింది.
భారీ బడ్జెట్ సినిమాల లెక్కల్లో తేడాలు
మైత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో నిర్మించిన సినిమాల వివరాలను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. ఐదేండ్ల క్రితం నుంచి ఫైల్ చేసిన ఐటీ రిటర్న్తో పాటు సినిమాలకు ఎంత ఖర్చు చేశారనే వివరాలను రాబడుతున్నారు. భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాల్లో హీరోల రెమ్యునరేషన్తో పాటు సినిమా పూర్తయ్యేదాకా అయిన ఖర్చులు, ట్యాక్స్ల చెల్లింపులపై ఆధారాలు సేకరిస్తున్నారు. సినిమాలకు ఇన్వెస్ట్ చేసిన వారు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ చెల్లింపుల్లో అవకతవకలు గుర్తించినట్లు తెలిసింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు మంగళవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.