ఆశలు రేకెత్తిస్తున్న.. ఐటీ హబ్

ఆశలు రేకెత్తిస్తున్న.. ఐటీ హబ్
  •     కేటీఆర్​ చేతుల మీదుగా నేడు ప్రారంభం 
  •     మినీ ట్యాంక్​బండ్, శ్మశాన వాటికనూ ప్రారంభించనున్న మంత్రి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని నిరుద్యోగ యువతలో జాబ్​ఆశలు రేకెత్తిస్తున్న ఐటీ హబ్​స్టార్ట్ కాబోతుంది. దీన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మినిస్టర్​ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నిజామాబాద్​వస్తున్నారు. గత నెల 28న ప్రారంభం కావాల్సి ఉన్నా ​ భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది. సిటీ శివారులోని కొత్త కలెక్టరేట్​పక్కన రూ. 50 కోట్ల ఖర్చుతో 3.20 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఇందుకు సుమారు అయిదేండ్లు పట్టింది. యువతకు శిక్షణనిచ్చి ఇతర దేశాల్లో జాబ్​లు పొందేలా ట్రైనింగ్​ఇవ్వడానికి ఐటీ హబ్​ పక్కనే రూ.6.15 కోట్లతో న్యాక్​ బిల్డింగ్​ నిర్మించారు.

జిల్లాలో 4 లక్షల యువకులు.. 

జిల్లాలో 13 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో సుమారు 4 లక్షల మంది యూత్​ఉన్నారు. అనేక మందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇతర చోట్లకు వలస వెళ్తున్నారు. గత నెల 21న నిర్వహించిన జాబ్​మేళాకు సుమారు పదివేల మంది హాజరవ్వడం జిల్లాలో నిరుద్యోగ తీవ్రతను తెలిపింది. ఈ జాబ్​మేళాకు 15 కంపెనీలు హాజరై 280 మందిని సెలెక్ట్​ చేశాయి.

రూ.22 కోట్లతో మినీ ట్యాంక్​బండ్..​

నిజామాబాద్​ సిటీలో సుమారు 6 లక్షల జనాభా ఉంది. ఏటా సిటీ విస్తరించడంతో కాలుష్యం పెరగి ఆహ్లాదం  కరువవుతోంది. ఈ నేపథ్యంలో ఖిల్లా వద్ద రఘునాథ్​ చెరువును మినీ ట్యాంక్​బండ్​ పేరుతో అభివృద్ధి చేశారు. ఇందుకోసం రూ.22 కోట్లు ఖర్చు చేశారు. వాకింగ్ ​ట్రాక్, గ్రీనరీ, రంగురంగుల కరెంట్​ దీపాలతో అలకరించారు. నేడు మినీ ట్యాంక్ బుధవారం నుంచి నగర ప్రజలకు ఉపయోగంలోకి రానుంది.

హైటెక్​ శ్మశానాలు..

నగరంలోని వర్ని రోడ్, దుబ్బా, అర్సాపల్లి శ్మశాన వాటికలకు రూ.15 కోట్లతో అభివృద్ధి చేశారు. వాటర్, పవర్​ ఫెసిలిటీతో పాటు అస్తికలు సేఫ్​గా పెట్టడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. రూ.7 కోట్ల ఖర్చుతో నిర్మించిన మున్సిపల్​ కార్పొరేషన్​ కొత్త బిల్డింగ్​ సైతం బుధవారం స్టార్ట్​ కాబోతుంది. ఖాళీ అయ్యే పాత భవనాన్ని నుడాకు అప్పగించనున్నారు.