గ్రేటర్ హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బుధవారం (జూన్ 21న) సాయంత్రం నుంచి పలు చోట్ల వర్షం పడుతోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఇక సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.
తార్నాక, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట, సికింద్రాబాద్, హబ్సిగూడ, బేగంపేట, సోమాజిగూడ, అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అంబర్పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరోవైపు.. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్తున్న ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
15 జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ
ఎండల వేడి, ఉక్కపోతకు అల్లాడిపోయిన నగరవాసులు సాయంత్రం నుంచి కురుస్తోన్న వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. వాతావరణశాఖ తెలంగాణలోని 15 జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వెల్లడించింది.
రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.