యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీ

యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీ

మారిన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైనదని, సమర్థతకు నైపుణ్యం కూడా తోడైతే తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని చెప్పారు. 

ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు లభించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ఏడేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యాచరణ ఓ కొలిక్కి వచ్చిందన్నారు. గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా తాము అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ మెరుగైన ఫలితాలను ఇస్తోందని వివరించారు.

పలు పథకాల అమలుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అయ్యాయని, దీంతో గ్రామీణ యువతకు ఉపాధి పెరుగుతోందన్నారు సీఎం.