ఎమ్మెల్సీ ఇంట్లో 4వ రోజు ఐటీ సోదాలు

ఎమ్మెల్సీ ఇంట్లో 4వ రోజు ఐటీ సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, ఆయన బంధువులు, పీఏ నివాసాల్లో వరుసగా నాల్గో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయమే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజపుష్ప విల్లాస్ కు చేరుకున్న అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ తో పాటు జీఎస్టీ చెల్లింపులపైనా ఐటీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజపుష్ప ప్రాపర్టీస్ తో పాటు వెర్టెక్స్, ముప్పా రియల్ ఎస్టేట్ సంస్థలు, వసుధ ఫార్మా కంపెనీ హెడ్ క్వార్టర్స్, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు చేశారు. ముప్పా మెలోడీస్ పేరుతో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెల్లాపూర్ లో భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. CRPF బలగాల భద్రత మధ్య  సోదాలు కొనసాగుతున్నాయి. 

రాజపుష్ప లైఫ్ స్టైల్ విల్లాస్ లో ఉంటున్న కంపెనీ డైరెక్టర్లు పి. శ్రీనివాస్ రెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, ఎండీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ సుజిత్ రెడ్డితో పాటు అకౌంటెంట్స్, సిబ్బంది ఇండ్లల్లో బుధవారం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. ఇదే విల్లాస్ లో ఉంటున్న వెంకట్రామిరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేశారు. రాజపుష్ప ప్రాపర్టీస్ కు చెందిన దాదాపు 15 ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సోదాలు నిర్వహించారు.  రియల్ ఎస్టేట్ లో రాజపుష్ప కంపెనీ పెట్టుబడులు, ఐటీ చెల్లింపులపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజ్ పుష్ప పలు సంస్థలతో ల్యాండ్ డెవలప్ మెంట్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో రాజపుష్పతో పాటు ముప్పా , వెర్టెక్స్ కన్ స్ట్రక్షన్స్, వసుధ ఫార్మా  కంపెనీల్లోనూ సోదాలు జరిపారు.